Former Vice President Venkaiah Naidu: సమస్య వస్తే గురువే దిక్కు
ABN , Publish Date - Oct 24 , 2025 | 04:42 AM
గూగుల్ వచ్చినా సమస్య వస్తే మాత్రం గురువు దగ్గరకే వెళ్లాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చమత్కరించారు.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్య
చాగంటికి పోలూరి హనుమజ్జానకీరామశర్మ పురస్కారం
హైదరాబాద్ సిటీ, అక్టోబరు23(ఆంధ్రజ్యోతి): గూగుల్ వచ్చినా సమస్య వస్తే మాత్రం గురువు దగ్గరకే వెళ్లాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చమత్కరించారు. ధారాళంగా మాట్లాడే నేర్పు తన గురువు బ్రహ్మశ్రీ పోలూరి హనుమజ్జానకీ రామశర్మ ఽప్రేరణతోనే తనకు వచ్చిందన్నారు. బొగ్గులకుంటలోని తెలంగాణ సారస్వత పరిషత్తు హాల్లో జరిగిన కార్యక్రమంలో పోలూరి హనుమజ్జానకీ రామశర్మ ధర్మనిధి సాహిత్య పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడు చాగంటి కోటేశ్వరరావుకు వెంకయ్య అందజేశారు. శాలువా, జ్ఞాపికతో పాటు ప్రశంసాపత్రంతో సత్కరించి రూ.25,000 నగదు పురస్కారాన్ని అందించారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు పెద్దవారికి మాత్రమే అనుకునే భ్రమను తొలగించి యువతరాన్ని కూడా ఆకట్టుకున్నారని చాగంటిని ప్రశంసించారు. తెలంగాణ సారస్వత పరిషత్తుకు వెంకయ్య నాయుడు ఇచ్చిన రూ.5 లక్షల విరాళంతో ఆయన గురువు హనుమజ్జానకీరామశర్మ పేరుమీద ప్రతి ఏటా ఒకరికి పురస్కారం ప్రదానం చేస్తున్నట్లు పరిషత్తు ప్రధాన కార్యదర్శి జే.చెన్నయ్య చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న శాంతా-వసంతా ట్రస్టు వ్యవస్థాపకుడు కేఐ వరప్రసాదరెడ్డి, సాహితీవేత్త రేపూరి అనంతపద్మనాభరావు కూడా పోలూరి శిష్యులే అని సభాధ్యక్షత వహించిన తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారుడు కేవీ రమణాచారి చెప్పారు. పురస్కార గ్రహీత చాగంటి మాట్లాడుతూ సనాతన ధర్మంలో గురువు మాటకు విశిష్టమైన స్థానం ఉందని అన్నారు.