kumaram bheem asifabad- బాలికల విద్యకు భరోసా
ABN , Publish Date - Jun 28 , 2025 | 11:13 PM
గ్రామీణ ప్రాంత నిరుపేద బాలికలు, అనాథ పిల్లలకు కస్తూర్బా గాంధీ విద్యాలయాలు అండగా నిలుస్తున్నాయి. విద్యార్థినులకు ఉచిత విద్య, వసతి, భోజనం, కార్పొరేట్ స్థాయిలో స్థాయిలో బోధన అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నాయి.
- 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఆంగ్లంలో బోధన
- సీఈసీ, బైపీసీ, ఎంపీసీతో పాటు వొకేషనల్ కోర్సులు
- జిల్లాలో 15 కస్తూర్బా పాఠశాలలు
గ్రామీణ ప్రాంత నిరుపేద బాలికలు, అనాథ పిల్లలకు కస్తూర్బా గాంధీ విద్యాలయాలు అండగా నిలుస్తున్నాయి. విద్యార్థినులకు ఉచిత విద్య, వసతి, భోజనం, కార్పొరేట్ స్థాయిలో స్థాయిలో బోధన అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నాయి.
బెజ్జూరు, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కస్తూర్బా బాలికా విద్యాలయాలు బాలికల బంగారు భవిష్యత్కు భరోసాగా నిలుస్తున్నాయి. చదువుకోవాలన్న నిరుపేద బాలికలకు వరంగా మారాయి. మంచి ఫలితాలు సాధిస్తున్న ఈ విద్యాలయాల్లో బాలికలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. మహిళా ఉపాధ్యాయులే పాఠాలు బోధిస్తారు. 6వ తరగతిలో ప్రవేశం పొందితే ఇంటర్ వరకు విద్యను కొనసాగించే అవకాశం ఉంది. ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉన్న ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సును కూడా ఇందులో బాలికలకు అందిస్తున్నారు. ఈ విద్యాలయంలో అడ్మిషన్ పొందే బాలికలకు పౌష్టికాహారంతో హాస్టల్ వసతి, నాణ్యమైన విద్య, ఉచిత దుస్తులు, పుస్తకాలు, నోట్బుక్లు అందిస్తారు. విద్యతో పాటు ఆత్మ విశ్వాసం పెంపొందించే విధంగా యోగా, కరాటే వంటి వాటిని కూడా ఇందులో శిక్షణ ఇస్తారు. అనాథ పిల్లలు, ఆర్థిక పరిస్థితుల వల్ల మద్యలో బడి మానేసిన పిల్లలు, చదువుకోవాలనే ఆసక్తి ఉన్న పేద పిల్లలకు కేజీబీవీ ప్రవేశాల్లో మొదటి ప్రాదాన్యత ఉంటుంది. బాలికలకు సమగ్ర విద్యను అందిస్తూ వారిలో ఉన్న నైపుణ్యాలకు మరింత పదును పెటఆఇ్టలనే లక్ష్యంతో కస్తూర్బా విద్యాలయాలను ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆద్వర్యంలో మండలానికి ఒకటి చొప్పున 13ఏళ్ల కిందట ఈ విద్యాలయాలను ఏర్పాటు చేశారు. పక్కా భవనాలను సైతం నిర్మించారు. మొదట్లో తెలుగు మీడియంలో ప్రారంభమైన ఈ విద్యాలయాలు క్రమంగా ఇంగ్లీష్ మీడియంగా మార్చి విద్యాబోధన చేస్తున్నారు. ఇప్పుడు 6వ తరగతిలో ఇంగ్లీష్ మీడియంలో అడ్మిషన్లు తీసుకుంటున్నారు.
- పాఠశాలల్లో మెరుగైన బోధన..
కస్తూర్బా పాఠశాలల్లో బాలికలను మెరుగైన బోధన అందిస్తున్నారు. బీఈడీ, ఎంఈడీ చేసిన కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్(సీఆర్టీ)లు పోస్ట్ గ్రాడ్యుయేట్ కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లు(పీజీసీఆర్టీ) విద్యాబోధన చేస్తారు. క్రాప్ట్ టీచర్లు కూడా అందుబాటులో ఉండి చేతి నైపుణ్యాలను నేర్పిస్తారు. యోగా, మార్షల్ ఆర్ట్స్, నృత్యాలు, చిత్రలేఖనం వంటి వాటిల్లో కూడా శిక్షణ ఇస్తారు. బాలికలకు ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తే వెంటనే స్పందించి ప్రాథమిక చికిత్స చేసేందుకు ప్రతీ కేజీబీవీల్లో ఒక ఏఎన్ఎంను నియమించారు. ప్రతీ రోజు ముగ్గురు టీచర్లు నైట్ డ్యూటీలో ఉంటారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం పౌష్టికాహారంతో పాటు ఉచితంగా యూనిఫామ్లు, దుప్పట్లు, కాస్మోటిక్ కిట్లు అందిస్తారు.
- జిల్లా వ్యాప్తంగా..
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 15కస్తూర్బా పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 6నుంచి పదో తరగతి వరకు ఒక్కో క్లాస్లో 40మంది చొప్పున ఒక్కో పాఠశాలలో 200మంది బాలికలు చదువుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 15పాఠశాలలుండగా, ఇందులో 13పాఠశాలల్లో ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేశారు. ఏటా మే నెల నుంచే 6వ తరగతిలో, మిగిలిన తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లలో అడ్మిషన్లు తీసుకుంటారు. కస్తూర్బా పాఠశాలల్లో ఇంటర్ అప్గ్రేడ్ చేసిన వాటిల్లో సీఈసీ, ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కావచ్చిందని అధికారులు తెలుపుతున్నారు.
బాలికలకు బంగారు భవిష్యత్తు
- భాగ్యలక్ష్మి, జీఈసీవో, ఆసిఫాబాద్
చదవాలనే ఆసక్తి ఉన్న బాలికలకు కేజీబీవీలు బంగారు భవిష్యత్తును ఇస్తాయి. అనాథ పిల్లలకు, బడి మానేసిన, ఆర్థికంగా వెనుకబడిన బాలికలు చదువుకు దూరం కాకుండా వారిని చేరదీసి ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో కేజీబీవీలను ఏర్పాటు చేశారు. ఇందులో నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్య రక్షణ, పౌష్టికాహారం ప్రభుత్వం ఇందిస్తుంది. ఇటీవల మెనూ కొత్తగా మార్చి రుచికరమైన బోజనాన్ని అందిస్తున్నాం. గుడ్లు, నెలకు రెండుసార్లు మటన్ లేదా చికెన్ విద్యార్థినులకు అందిస్తున్నాం.