BJP Telangana president N. Ramchander Rao: ఉపాధి హామీ పథకం రద్దు కాలేదు
ABN , Publish Date - Dec 18 , 2025 | 03:21 AM
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు కాలేదని, కేంద్ర ప్రభుత్వం ఆ పథకం పేరును మాత్రమే మార్చిందని...
పేరు మార్పుపై కాంగ్రె్సది రాద్ధాంతం: రాంచందర్రావు
హైదరాబాద్, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు కాలేదని, కేంద్ర ప్రభుత్వం ఆ పథకం పేరును మాత్రమే మార్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పేర్కొన్నారు. పథకానికి వికసిత్ భారత్- జీ రామ్ జీ అని పేరు మార్చడంతో పాటు.. పనిదినాలను 100 నుంచి 125 రోజులకు పెంచుతున్నట్లు చెప్పారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ అనవసరంగా రాజకీయ రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పథకం పేరులో రామ్ అనే పదం ఉండటమే కాంగ్రె్సకు అభ్యంతరమా? అని ప్రశ్నించారు. మహాత్మాగాంధీ నమ్మిన సిద్ధాంతాన్ని అమలు చేస్తుంటే గాంధీ వారసులమని చెప్పుకునే వాళ్లకు ఎందుకు కడుపు మంట అని నిలదీశారు. పదేళ్ల కాంగ్రెస్ హయాంలో ఉపాధి హామీ పథకం కోసం కేవలం రూ. లక్ష కోట్లు ఖర్చుచేస్తే.. ప్రధాని మోదీ హయాంలో 11 ఏళ్లలో రూ.8 లక్షల కోట్లుకుపైగా నిధులు వెచ్చించినట్లు వివరించారు. మోదీపై అనుచిత వాఖ్యలు చేసినా, అబద్ధపు ప్రచారంతో బీజేపీ కార్యాలయాల ముందు ధర్నాలు చేసినా సహించేది లేదని హెచ్చరించారు.