kumaram bheem asifabad- ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి
ABN , Publish Date - Oct 04 , 2025 | 10:50 PM
జిల్లాలో రెండో సాధారణ పంచాయతీ ఎన్నికలను నిబంధనల లోబడి, ఎలాంటి పొరపాట్లు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో శనివారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కొరకు ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రాలోని స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ గదులను ఎస్పీ కాంతిలాల్ సుభాష్ పాటిల్తో కలిసి పరిశీలించారు
ఆసిఫాబాద్ రూరల్, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండో సాధారణ పంచాయతీ ఎన్నికలను నిబంధనల లోబడి, ఎలాంటి పొరపాట్లు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో శనివారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కొరకు ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రాలోని స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ గదులను ఎస్పీ కాంతిలాల్ సుభాష్ పాటిల్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను జిల్లాలో రెండు విడుతలుగా నిర్వహించనున్నామని తెలిపారు. నవంబర్ 11న ఓట్ల లెక్కింపు ఉన్నందున కౌంటింగ్ కేంద్రంలోని స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ గదులలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని జడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణను ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాలలో ఎలాంటి పొరపాట్లు జరగకుం డా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. వారి వెంట జడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, తహసీల్దార్ రియాజ్ అలీ, ఎంపీడీవో శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): కెరమెరి మండలం జోడేఘాట్లో మంగళవారం నిర్వహించనున్న కుమరం భీం వర్ధంతి కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కగలకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ సమావేశం మందిరంలో శనివారం కుమరం భీం వర్ధంతి కార్యక్రమ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ కుమరం భీం వర్ధంతి వేడుకలకు తాగునీరు, రవాణా భోజన వసతి, విద్యుత్సరఫరా, వైద్య శిబిరాలు, పారిశుధ్య కార్యక్రమాలను పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఆర్టీసీ అధికారులు వర్ధంతి వేడుకలకు వచ్చే ప్రజల కోసం బస్సులు ఏర్పాటు చేయాలని తెలిపారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా సురక్షిత నీటి ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని, వాటర్ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. భోజన వసతి కల్పించాలని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. రవాణాలు ఇబ్బందులు కలగకుండా రహదారి మరమ్మతులు చేపట్టాలని చెప్పారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమానికి బందో బస్తు కల్పంచాలని తెలిపారు. అధికారులు సమన్వయంతో పని చేసి భీం వర్ధంతి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో డీపీవో భిక్షపతిగౌడ్, గిరిజనాభివృద్ధి అధికారి రమాదేవి, డీఎంహెచ్ సీతారాం, డీఎల్పీవో ఉమర్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.