ఒక్కొరిది ఒక్కో బాధ
ABN , Publish Date - May 27 , 2025 | 12:30 AM
న్యాయం చేయాలని ఒకరు... ఇల్లు మంజూరు చేయాలని మరొకరు... అక్రమాలను అడ్డుకోవాలని ఇం కొకరు... తమకు వారసత్వ భూములను ఇప్పించాలని.... వ్యయప్రయాసాలను తీర్చాలని మరికొందరు.. ఇలా రకరకాల సమస్యలతో జిల్లా నలుమూలల నుంచి అనేకమంది బాధితులు ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి వారంవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీనివాసులు బాధితుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.
ఒక్కొరిది ఒక్కో బాధ
ప్రజావాణికి వినతుల వెల్లువ
సమస్యల పరిష్కారానికి తరలివస్తున్న బాధితులు
- (ఆంధ్రజ్యోతి,నల్లగొండ టౌన)
న్యాయం చేయాలని ఒకరు... ఇల్లు మంజూరు చేయాలని మరొకరు... అక్రమాలను అడ్డుకోవాలని ఇం కొకరు... తమకు వారసత్వ భూములను ఇప్పించాలని.... వ్యయప్రయాసాలను తీర్చాలని మరికొందరు.. ఇలా రకరకాల సమస్యలతో జిల్లా నలుమూలల నుంచి అనేకమంది బాధితులు ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి వారంవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీనివాసులు బాధితుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. వాటిలో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించగా మరికొన్నిటి సమస్యలు పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు లేఖలు రాశారు.
మా వాటా మాకు ఇప్పించండి
మాకు మా గ్రామంలో వంశపారపర్యంగా వేల ఎకరాల భూమి వస్తుంది. ఆ భూమంతా మా తాత పేరిట ఉండేది. మా నాన్నతో పాటు ఆయనకు నలుగు సోదరులు కూడా ఉన్నారు. అయితే పెద్దవాడైన మా నాన్న మా చిన్నతనంలో నే చనిపోవడంతో అమ్మ చదువుల నిమిత్తం మమ్మల్ని నల్లగొండకు తీసుకువచ్చింది. అప్పటి నుంచి మేము పెద్ద వా ళ్లం అయ్యేంతవరకు కూడా వారసత్వ సంపద అంతా కూ డా మా తాత పేరు మీదనే ఉండేది. కొంత కాలం క్రితం తాత కాలం చేయడంతో నలుగురు బాబాయిలు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై మాకు భూమి దక్కకుండా వాళ్ల పేరిట ఆర్ఓఆర్ పట్టా చేయించుకున్నారు. ఇది తెలియని మేము ఇంతకాలం తమకు కూడా భూమి లో వాటా వస్తుందని అనుకున్నాం. తీరా ఇప్పుడు వెళ్లి చూస్తే తమకు వాటా లేదంటూ దబాయిస్తున్నా రు. వారసులం ఉన్నా కూడా తమకు భూమిలో వాటా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తే తమపై దౌర్జన్యానికి పాల్పడటమే కాకుండా దిక్కున్నచోట చెప్పుకోండని అం టూ బెదిరిస్తున్నారు. రెవెన్యూ, పోలీస్ అధికారులు సైతం నిమ్మకు నీరె త్తినట్లు ఉంటున్నారు. దయచేసి దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి తాత ఆస్తిలో తమకు తమ వాటా ఇప్పించి న్యాయం చేయండి.
- తండు శ్రావణి, తిప్పర్తి
అవస్థలు తీర్చండి
మేమంతా ప ట్టణంలోని నాలుగో వార్డు కేశరాజుపల్లికి చిందిన పెన్షనదారులము. గ్రామంలోనే పోస్టాఫీస్ ఉన్నా మాకు ఆ పోస్టీఫీస్లో కాకుండా పట్టణంలోని రామగిరి పోస్టాఫీస్లో పింఛన ఇస్తున్నారు. దీంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నాం. ప్రతీ నెలా పింఛన కోసం ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి పట్టణంలోని రామగిరికి వెళ్లాల్సి వస్తుంది. తమ పరిస్థితిని అర్థం చేసుకొని కేశరాజుపల్లిలో ఉన్న పోస్టాఫీస్కు తమ పింఛనను ట్రాన్సఫర్ చేయాలని కోరారు.
- పెన్షన దారులు, కేశరాజపల్లి, నల్లగొండ
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి
నేను నిరుపేద కుటుంబానికి చెందిన వాడను. నేను మా ఊరిలో చిన్న రేకుల ఇంట్లో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నాను. నేను ఇప్పటివరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థికంగా లబ్ధి పొందలేదు. మాకు ఎలాంటి స్థిర చర ఆస్తులు కూడా లేవు. ఇటీవల ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నాను. అధికారులు సర్వే సైతం పూర్తి చేశారు. కానీ ప్రస్తుతం విడుదల చేసిన జాబితాలో నా పేరు లేదు. ఇదేంటంటే ప్రశ్నిస్తే నీకు ఇంటి జాగా లేదని సమాధానం ఇస్తున్నారు. ఇంటి స్థలం లేనప్పుడు ప్రస్తుతం నేను ఉంటున్న ఇల్లు ఎవరిదని ప్రశ్నిస్తూ అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా అధికారులకు సమర్పించాను. అయినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దయచేసి నాకు ఇందిరమ్మ ఇంటిని కేటాయించి న్యాయం చేయాలి.
- సతీష్ , కేశరాజుపల్లి, నల్లగొండ
అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా
నాకు మా గ్రామంలో సర్వే నెంబర్లో రెండు ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని నా తండ్రి పసుపు కుంకుమ కింద నా పేరిట రిజిస్ట్రేషన చేశారు. అయితే తన భూమిపై కన్నేసిన తమ కుటుంబానికి చెందిన కొంతమంది దొంగ సంతకాలతో వారి పేర్ల మీద పట్టా చేయించుకున్నారు. ఈ విషయాన్ని తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా అక్కడ ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు లెక్క చేయడం లేదు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి తనకు న్యాయం చేయాలి.
- యాస లక్ష్మమ్మ, కాపరాయిపల్లి, మోత్కూరు
బిల్లు ఇప్పించండి
నేను ఒక చిన్న కాంట్రాక్టరుని. తమ మునిసిపాలిటీలో ని మూడో వార్డులో బీసీ కమ్యూనిటీ హాల్ను రెండేళ్ల క్రితం నిర్మాణం చేపట్టాను. సుమారు రూ. 5లక్షల వ్యయం తో చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసి ఎంబీ రికార్డింగ్ కూడా పూర్తి చేశాను. అయినా ఇంతవరకు బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాను. దీనిపై గడిచిన 16 నెలల కాలంలో అనేక మంది ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. డీఎంఎఫ్టీ నిధులు మంజూరు చేసి ఆదుకోవాలి...
- స్వామికుమార్, చండూరు