Share News

Drug Trade in Hyderabad: ఓ డాక్టర్‌ డ్రగ్స్‌ దందా

ABN , Publish Date - Nov 05 , 2025 | 03:58 AM

హైదరాబాద్‌లో డ్రగ్స్‌ కేసులు కలకలం రేపుతున్నాయి. రోగులు ప్రాణాలు కాపాడాల్సిన ఓ వైద్యుడు మత్తుకు బానిసై స్నేహితులతో కలిసి చేస్తున్న...

Drug Trade in Hyderabad: ఓ డాక్టర్‌ డ్రగ్స్‌ దందా

  • మత్తుకు బానిసై.. ఆపై వ్యాపారం

  • పట్టుకున్న ఎక్సైజ్‌ పోలీసులు

  • మాదక ద్రవ్యాలు స్వాధీనం

  • వైద్యుడి అరెస్టు, ముగ్గురి పరారీ

  • గచ్చిబౌలిలో డ్రగ్స్‌ పార్టీ భగ్నం

  • 11 మంది అరెస్టు

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో డ్రగ్స్‌ కేసులు కలకలం రేపుతున్నాయి. రోగులు ప్రాణాలు కాపాడాల్సిన ఓ వైద్యుడు మత్తుకు బానిసై స్నేహితులతో కలిసి చేస్తున్న డ్రగ్స్‌ దందాను ఎక్సైజ్‌ ఎస్‌టీఎఫ్‌ పోలీసులు రట్టు చేశారు. ఆ వైద్యుడి వద్ద రూ.3లక్షల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో నివాసముంటున్న జాన్‌పాల్‌ అనే యువకుడు స్థానికంగా పీజీ వైద్య విద్య అభ్యసిస్తున్నాడు. స్నేహితుల ద్వారా డ్రగ్స్‌కు అలవాటుపడిన జాన్‌పాల్‌ క్రమంగా వాటికి బానిసయ్యాడు. అయితే, డ్రగ్స్‌ కొనుగోలు చేసేందుకు డబ్బు లేక స్నేహితులతో కలిసి డ్రగ్స్‌ దందాలోకి దిగాడు. తన స్నేహితులు సందీప్‌, ప్రమోద్‌, శరత్‌తో కలిసి ముఠాగా ఏర్పడ్డాడు. ఈ ముగ్గురూ తమకున్న పరిచయాల ద్వారా ఢిల్లీ, బెంగళూరు నుంచి ఓజీకుష్‌ (విదేశీ గంజాయి), ఎండీఎంఏ, ఎల్‌ఎ్‌సడీ బ్లాట్స్‌, కొకైన్‌, హాషిష్‌ ఆయిల్‌ వంటి మాదక ద్రవ్యాలను దిగుమతి చేసుకునేవారు. వాటిని జాన్‌పాల్‌ గదిలో ఉంచి విక్రయించేవారు. జాన్‌పాల్‌ తనకు కావాల్సినప్పుడు ఆ డ్రగ్స్‌ను వినియోగించేవాడు. స్నేహితుల సూచనల మేరకు తన వద్దకు వచ్చిన వారికి డ్రగ్స్‌ విక్రయించేవాడు. సమాచారం అందుకున్న ఎక్సైజ్‌ పోలీసులు.. జాన్‌పాల్‌ ఇంటిపై మంగళవారం దాడి చేశారు. జాన్‌పాల్‌ గదిలో రూ.3లక్షల విలువైన ఓజీ కుష్‌, ఎండీఎంఏ, ఎల్‌ఎ్‌సడీ బ్లాట్స్‌, కొకైన్‌, గుమ్మస్‌, హాషిష్‌ ఆయిల్‌ స్వాధీనం చేసుకున్నారు. జాన్‌పాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న సందీప్‌, ప్రమోద్‌, శరత్‌ కోసం గాలిస్తున్నారు.


డ్రగ్స్‌ పార్టీ కలకలం

హైదరాబాద్‌, గచ్చిబౌలి ప్రాంతంలో జరుగుతున్న డ్రగ్స్‌ పార్టీని భగ్నం చేసిన ఎస్‌ఓటీ పోలీసులు ఓ నైజీరియన్‌ సహా 11 మందిని అరెస్టు చేశారు. వారినుంచి రూ.6లక్షలు విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలి టీఎన్‌జీవో కాలనీలోని ఎస్‌ఎం లగ్జరీ గెస్ట్‌ రూమ్‌ కోలివింగ్‌, పీజీ హస్టల్స్‌లోని ఓ గదిలో డ్రగ్స్‌పార్టీ జరుగుతుందనే సమాచారం తో పోలీసులు దాడి చేశారు. డ్రగ్స్‌ వినియోగిస్తున్న పలువురిని, సరఫరా చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిచ్చిన సమాచారంతో మాదాపూర్‌లో నైట్‌ ఐ హోటల్‌లో దాడిచేసి మరో నలుగురిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.6లక్షల విలు వైన ఎండీఎంఎ డ్రగ్స్‌, గంజాయి, రూ.10 వేల నగదు, 2బైక్‌లు, స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో గుత్తా తేజకృష్ణ, షజీర్‌ మొటుంగారా(నైజీరియన్‌), వె న్నెల రవికిరణ్‌, పాకనాటి లోకేష్‌ రెడ్డి, పెద్దమంతూర్‌ హర్షవర్దన్‌రెడ్డి, మన్నె వెంకట ప్రశాంత్‌, పృథ్వీ విష్ణు వర్దన్‌, కార్లపూడి ప్రెస్లీ సుజిత్‌, మేకల గౌతం, గుండె బోయిన నాగార్జున, గుంటక సతీ్‌షరెడ్డి ఉన్నారు. కాగా, గుత్తా తేజ కృష్ణ ప్రధాన స్మగ్లర్‌ అని, ఓ నైజీరియన్‌తో కలిసి కర్ణాటక నుంచి డ్రగ్స్‌ తెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. కొందరు నైజీరియన్లు సహా పరారీలో ఉన్న మరో 7 మంది కోసం గాలిస్తున్నామని మాదాపూర్‌ జోన్‌ అదనపు డీసీపీ ఎన్‌.ఉదయ్‌రెడ్డి చెప్పారు.

Updated Date - Nov 05 , 2025 | 03:58 AM