Forensic Audit: కమాండ్ సెంటర్లో ధరణి ఫోరెన్సిక్ ఆడిట్
ABN , Publish Date - Sep 18 , 2025 | 06:30 AM
ధరణి అవకతవకలపై వచ్చిన ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు చేపట్టనున్న ఫోరెన్సిక్ ఆడిట్ హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ భవనంలో జరగనుంది....
హైదరాబాద్, సెప్టెంబరు17(ఆంధ్రజ్యోతి): ధరణి అవకతవకలపై వచ్చిన ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు చేపట్టనున్న ఫోరెన్సిక్ ఆడిట్ హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ భవనంలో జరగనుంది. కేరళ సెక్యూరిటీ ఆడిట్ అండ్ అస్యూరెన్స్(కేఎ్సఏఏసీ) సంస్థ ఈ ఫోరెన్సిక్ ఆడిట్ చేయనుంది. ఈ సంస్థ కార్యకలాపాల నిర్వహణకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి సీసీఎల్ఏ ఏర్పాట్లు చేస్తోంది. రెండ్రోజుల క్రితం పది కంప్యూటర్లు, ఇతర సాంకేతిక పరికరాలను సమకూర్చేందుకు ఆదేశాలిచ్చింది. ఫోరెన్సిక్ ఆడిట్కు అవసరమైన సిబ్బందిని, సాంకేతిక సహకారాన్ని అందించాలని తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ను ఆదేశించింది. కాగా, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఇప్పటికే ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తున్న కేఎ్సఏఏసీ.. ఆ జిల్లాలో ప్రక్రియ పూర్తవ్వగానే రాష్ట్ర వ్యాప్తంగా ఆడిట్ నిర్వహిస్తుంది. అయితే, కేఎ్సఏఏసీ సంస్థ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు అంశం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.