kumaram bheem asifabad- అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Sep 04 , 2025 | 12:00 AM
జిల్లాలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో గల వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్ దీపక్ తివారి, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లాతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఉపాధి హామి పథకం, ఏపీఓలు, సెర్ప్ ఏపీఎంలు, హౌసింగ్ ఇంజనీరింగ్ అధికారులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, లబ్ధదారులకు బ్యాంకు లింకేజి ద్వారా రుణ సదుపాయం, వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటడం, పారిశుధ్య పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో గల వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్ దీపక్ తివారి, సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లాతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఉపాధి హామి పథకం, ఏపీఓలు, సెర్ప్ ఏపీఎంలు, హౌసింగ్ ఇంజనీరింగ్ అధికారులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, లబ్ధదారులకు బ్యాంకు లింకేజి ద్వారా రుణ సదుపాయం, వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటడం, పారిశుధ్య పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇందరిమ్మ ఇళ్ల పనులను వేగవంతం చేయాలని చెప్పారు. బేసిమెంట్ నిర్మాణం ఆలస్యం చేసిన వారిని గుర్తించి బ్యాంకు లింకేజీ మండల సమాఖ్య ద్వారా ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని సూచించారు. వారికి లక్ష రూపాయల రుణం అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. విడతల వారీగా లబ్ధిదారుల ఖాతాలో నిధులు జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ప్రధానమంత్రి జన్ మన్ పథకం కింద పీవీటీజీలకు 100 శాతం ఇళ్లు మంజూరు చేశామని అన్నారు. అర్హులైన లబ్ధిదారుల జాబితా అందించాలని తెలిపారు. పనుల జాతర క్యాక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాలు, అంగన్వాడీ కేంద్రాల భవనాలు, పశువుల షెడ్లు, పౌలీ్ట్ర షెడ్, గోట్ షెడ్ల నిర్మాణం, ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల రహదారులపై ఏర్పడ్డ గుంతలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని గ్రామాలలో పారిశుధ్య పనులు నిరంతరం నిర్వహించాలని తెలిపారు. గుంతలలో వర్షపు నీరు నిలువకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని దోమల వృద్ధిని అరికట్టే విధంగా అయిల్బాల్స్, బ్లీచింగ్ పౌడర్ పిచికారి చేయాలని తెలిపారు. ఆయిల్పామ్ పంటలను సాగుపై రైతులకు అవగాహన కల్పించి సాగు విస్తీర్ణం పెంపొందించే విధంగా ప్రోత్సహించాలని సూచించారు. వనమహోత్సవం 2025 కార్యక్రమంలో భాగంగా జిల్లాకు కేటాయించిన లక్ష్యాలను త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి, హౌసింగ్ పీడీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
మహిళలకు చేయూత ఇస్తున్నాం
ఆసిఫాబాద్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా చేయూతనిస్తున్నామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం ఆవరణలో ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఆసిఫాబాద్ మండలం బూర్గుడ గ్రామానికి చెందిన స్వయం సహాయక సంఘాల సభ్యురాలు కుందారపు రాణికి రూ.10 లక్షతో మంజూరు అయిన మొబైల్ చేపల విక్రయ వాహనం యూనిట్ను బుధవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి రిబ్బర్కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా అనేక వ్యాపారాలు చేసేందుకు ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ప్రభు త్వం అందిస్తున్న రుణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. బూర్గుడ గ్రామానికి చెందిన స్వయం సహయక సంఘం సభ్యురాలు రూ.4 లక్షల సొంత నిధులు, రూ.6 లక్షల ప్రభుత్వ రాయితీ నిధులతో సంచార చేపల విక్రయ వాహనం నిర్వహించేం దుకు ముందకు రావడం సంతోషంగా ఉందని, మహిళలు వ్యాపారాలు నిర్వహించి ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు.