Deputy CM Bhatti Vikramarka: ప్రజల జీవితాలు మార్చటమే విజయం
ABN , Publish Date - Dec 19 , 2025 | 04:14 AM
ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావటమే ప్రభుత్వ అధికారులకు నిజమైన విజయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
యువ ఐఏఎస్, సీసీఎస్ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
పరిపాలన అంటే.. ప్రజలతో మమేకమవడమే : శ్రీధర్బాబు
హైదరాబాద్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావటమే ప్రభుత్వ అధికారులకు నిజమైన విజయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రజలకు నిజాయితీగా సేవ చేయాలని, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలని శిక్షణ పూర్తి చేసుకున్న యువ ఐఏఎస్, సీసీఎస్ అధికారులకు ఉద్బోధించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్ఆర్డీ)లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీ్స(ఐఏఎస్), సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (సీసీఎస్) అధికారులు 10 వారాల శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం నిర్వహించిన కార్యక్రమంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. కఠిన శిక్షణ పూర్తిచేసుకొని వెళ్తున్న అధికారులు.. వివేకం, విచక్షణ, ప్రజల పట్ల విశ్వాసంతో సేవలు అందించాలని కోరారు. కొన్ని సందర్భాల్లో ప్రశంసలతోపాటు విమర్శలు కూడా వస్తాయని, అవన్నీ ప్రజల కోసమే అన్న భావనతో ముందుకెళ్లాలని సూచించారు. సివిల్ సర్వెంట్ల నుంచి ఈ దేశం పరిపూర్ణత(పర్ఫెక్షన్)ను మాత్రమే ఆశించడం లేదని, అంతకంటే ఎక్కువగా నిజాయితీ (సిన్సియారిటీ)ని కోరుకుంటోందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. గవర్నెన్స్ అంటే ఫైళ్లు, నిబంధనలు కాదని.. ప్రజలతో మమేకమయ్యే బంధమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంసీహెచ్ఆర్డీ వైస్ చైర్మన్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారిలో 203 మంది ఐఏఎస్, సీసీఎస్ అధికారులున్నారు.