స్థానిక సమస్యలపై సీపీఐ యుద్ధభేరి
ABN , Publish Date - Dec 28 , 2025 | 12:19 AM
యాదగిరిగుట్ట మునిసిపాలిటీ పరిధిలోని ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి యుద్ధభేరి మోగించనున్నట్లు సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు గోద శ్రీరాములు అ న్నారు.
సేకరించిన సమస్యలపై ధర్నా రేపు
సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు గోద శ్రీరాములు
యాదగిరిగుట్ట రూరల్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట మునిసిపాలిటీ పరిధిలోని ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి యుద్ధభేరి మోగించనున్నట్లు సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు గోద శ్రీరాములు అ న్నారు. సీపీఐ ఆధ్వర్యంలో ఇంటింటికీ సీపీఐ పాదయాత్ర శనివారం రెండో రోజుకు చేరింది. 5వ, 6,వ 7వ, 8వవార్డుల్లో సీపీఐ బృందం సభ్యులు ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొత్తగుండ్లపల్లి గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గాలేకపోవడంతో ఇళ్ల మధ్యే మురుగునీరు నిలుస్తోందన్నారు. ప్రతీవార్డులో విద్యుత్ లేన్లు కిందికి వేలాడుతూ ప్రమాదం పొంచి ఉన్నా, పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆందోళన వ్యక్తంచేశారు. పట్టణంలో అమృత్ పథకం పనులు సరిగా చేయలేదన్నారు. దీంతో వృద్ధులు, పిల్లలు, ద్విచక్రవాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. సమస్యల పరిష్కారంకోసం మునిసిపల్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ఈ నెల 29న ఆందోళన నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతకు ముందు ఎనిమిదో వార్డులో సీపీఐ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు కళ్లెం కృష్ణ, పేరబోయిన మహేందర్, మండల కార్యదర్శి కల్లెపల్లి మహేందర్, పట్టణ కార్యదర్శి బబ్బూరి శ్రీధర్, ఏఐటీయుసీ జిల్లా అధ్యక్షుడు గోరేటి రాములు, మాజీ కోఆప్షన్ సభ్యుడు పేరబోయిన పెంటయ్య, పేరబోయిన బంగారి, పేరబోయిన పెంటయ్య, గుండు వెంకటేష్, రాయగిరి బాలకిషన్ పాల్గొన్నారు.