CPI Centenary Celebration: సీపీఐ వందేళ్ల ముగింపు ఉత్సవాలకు 40 దేశాల ప్రతినిధులు
ABN , Publish Date - Dec 27 , 2025 | 04:25 AM
సీపీఐ వందేళ్ల ఉత్సవాలను చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో నిర్వహిస్తున్నామని, ఈ వేడుకలకు 40 దేశాల నుంచి ప్రతినిధులను ఆహ్వానించామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి.....
జనవరి 18న ఖమ్మంలో ఐదు లక్షల మందితో భారీ సభ
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని వెల్లడి
హైదరాబాద్, డిసెంబరు 26 (ఆంధ్ర జ్యోతి): సీపీఐ వందేళ్ల ఉత్సవాలను చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో నిర్వహిస్తున్నామని, ఈ వేడుకలకు 40 దేశాల నుంచి ప్రతినిధులను ఆహ్వానించామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పారు. జనవరి 18న ఖమ్మంలో అయిదు లక్షల మందితో భారీ సభ ఉంటుందన్నారు. సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్లోని మఖ్ధూం భవన్లో శుక్రవారం అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కూనంనేని మీడియాతో మాట్లాడారు. కమ్యూనిస్టులు ఎక్కడ? అని ప్రశ్నించే వారికి కనువిప్పు కలిగే విధంగా ఎర్ర సముద్రాన్ని తలపించేలా లక్షలాది మందితో ఖమ్మం బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సౌహార్ద సందేశార్థం సీఎం రేవంత్ రెడ్డితోపాటు జాతీయ వామపక్ష పార్టీల నాయకులను, 40 దేశాల ప్రతినిధులను ఆహ్వానిస్తున్నామన్నారు. జనవరి 19న జాతీయ వామపక్ష పార్టీల నాయకులతో సదస్సు, ఆ తరువాత సీపీఐ జాతీయ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. సభను జయప్రదం చేసేందుకు జిల్లాల వారీగా జాతాలను నిర్వహిస్తామన్నారు. జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ప్రజలను చైతన్యం చేసే శక్తి ఎర్రజెండాకే ఉందన్నారు.