Cotton farmers protest: పత్తి రైతుల ఆందోళన
ABN , Publish Date - Nov 22 , 2025 | 04:43 AM
తమ సమస్యలను పరిష్కరించాలంటూ పత్తి రైతులు ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలంలో శుక్రవారం జాతీయ రహదారిపై బైఠాయించారు....
సమస్యలు పరిష్కరించాలని జాతీయ రహదారిపై బైఠాయింపు
హైదరాబాద్-నాగపూర్ హైవేపై నిలిచిన రాకపోకలు
ఆదిలాబాద్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి) : తమ సమస్యలను పరిష్కరించాలంటూ పత్తి రైతులు ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలంలో శుక్రవారం జాతీయ రహదారిపై బైఠాయించారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి భారీ ఎత్తున రైతులు తరలివచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో హైదరాబాద్-నాగపూర్ రహదారిపై గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్డు పైనే రొట్టెలు తింటూ రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీమంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. సీసీఐ విధించిన ఏడు క్వింటాళ్ల పరిమితి, ఇతర నిబంధనలను తొలగించాలని డిమాండ్ చేశారు. కపాస్ కిసాన్ యాప్తో పాటు బయోమెట్రిక్ విధానాన్ని తొలగించాలన్నారు. సీసీఐ విధిస్తున్న కఠినమైన నిబంధనల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. తేమ శాతాన్ని 20 నుంచి 22 శాతానికి పెంచాలని కోరారు. ఇంత జరుగుతున్నా బీజేపీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడం లేదన్నారు. షరతులు విధించకుండా పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం, సీపీఐ, రైతు సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.