Ganja Seizure: కంటైనర్లో 4.99 కిలోల గంజాయి పట్టివేత
ABN , Publish Date - Oct 14 , 2025 | 02:18 AM
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ మీదుగా రాజస్థాన్లోని జైపూర్కు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ...
96 ప్యాకెట్లలో ఏపీ నుంచి జైపూర్కు రవాణా యత్నం
రూ.2.50 కోట్లు ఉంటుందని అంచనా.. ఇద్దరు నిందితుల అరెస్టు
సుజాతనగర్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ మీదుగా రాజస్థాన్లోని జైపూర్కు అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారని ఎస్పీ రోహిత్ రాజు మీడియాకు చెప్పారు. ఈ క్రమంలో సుమారు 4.99 క్వింటాళ్ల గంజాయిని, ఒక కంటైనర్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ గంజాయి విలువ రూ.2.50 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం మీదుగా జైపూర్కు గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం రావడంతో సుజాతనగర్ ఎస్ఐ రమాదేవి నేతృత్వంలో సీసీఎస్, పోలీసులు అదే మండలంలోని వేపలగడ్డ వద్ద చేపట్టిన తనిఖీల్లో ఓ కంటైనర్లో 96 ప్యాకెట్లలో 4.99 కిలోల గంజాయి దొరికింది. ఆ గంజాయిని, కంటైనర్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కర్ణాటక వాసి జగదీష్ దయారాం పాటిల్, మహారాష్ట్ర నివాసి సంజూ కుమార్లను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి కీప్యాడ్ మొబైల్ ఫోన్లనూ స్వాధీనం చేసుకున్నారు. జగదీశ్, సంజూలతోపాటు మహారాష్ట్ర వాసి అమిత్ రోహిదాస్ పాటిల్, గంజాయి విక్రయించిన ఒడిశా వాసి హరి (జైపూర్) పరారీలో ఉన్నారని ఎస్పీ రోహిత్ రాజు వివరించారు. వీరితోపాటు గంజాయి విక్రేతలపై కేసు నమోదు చేశామని తెలిపారు. గతంలోనూ గంజాయి అక్రమ రవాణా చేసిన కేసుల్లో జగదీష్, సంజూ నిందితులని రోహిత్ రాజు చెప్పారు.