kumaram bheem asifabad- కాలనీలు జలమయం
ABN , Publish Date - Jul 17 , 2025 | 11:16 PM
జిల్లాలోని ఆసిఫాబాద్తో పాటు, కాగజ్ననగర్ పట్టణం, మండలంలో గురువారం గంట పాటు భారీ వర్షం కురిసింది. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆకాశం ఒక్క సారిగా మేఘావృతమై కారు మబ్బులతో చిమ్మచీకట్లు అలుముకున్నాయి.
ఆసిఫాబాద్/కాగజ్నగర్, జూలై 17(ఆంద్రజ్యోతి): జిల్లాలోని ఆసిఫాబాద్తో పాటు, కాగజ్ననగర్ పట్టణం, మండలంలో గురువారం గంట పాటు భారీ వర్షం కురిసింది. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఉదయం 10 గంటల ప్రాంతంలో ఆకాశం ఒక్క సారిగా మేఘావృతమై కారు మబ్బులతో చిమ్మచీకట్లు అలుముకున్నాయి. సుమారు గంట సేపు ఎడతెరిపి లేకుండా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కురువడంతో పట్టణంలోని పలు కాలనీలు జలమయం అయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక పోవడంతో పైకాజీగర్ కాలనీలో వరద నీరు భారీగా వచ్చి చేరింది. రోడ్లు చెరువులను తలపించాయి. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుఒ్కన్నారు. భారీ వర్షం కురిసినప్పుడల్లా కాలనీలో వరద నీరుతో నిండుకుపోయి పూర్తిగా జలమయమవుతు న్నాయని, సంబంధిత అదికారులకు ఈ విషయాన్ని విన్నవించినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షంతో పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద వరద నీరు రోడ్లపై వచ్చి చేరడంతో పాదాచరులకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. బ్రాహ్మణవాడలో రోడ్లపై వరద నీరు భారీగా వచ్చి చేరింది. చెక్ పోస్టు కాలనీ, జన్కాపూర్, ఎస్సీ కాలనీ వరద నీరు వచ్చి చేరడంతో రోడ్లన్ని బురద మయంగా మారాయి. కాగా జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్నగర్, సిర్పూర్(టి)లో గురువా రం అత్యధిక వర్షపాతం నమోదు అయింది. ఆసిఫాబాద్ మండలంలో 33 మిల్లీమీటర్లు, కాగజ్నగర్లో 57.3, సిర్పూర్(టి)లో 36.3, రెబ్బెనలో 27, కౌటాలలో 9.5 కెరమెరిలో 7.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. కాగజ్నగర్ పట్టణంలో ఉదయం పది గంటలకు భారీ వర్షం కురిసింది. గంట పాటు వర్షం కురువడంతో లోతట్టు ప్రాంతాలైన సంజీవయ్య కాలనీ, మార్కెట్ ఏరియాలో పలు కాలనీల్లోకి వరదనీరు చేరింది. దిగువన ఉన్న ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. పలు దుకాణాల్లో బయట ఉన్న సామగ్రి తడిసి పోయింది. డ్రమ్ములు వరదలో కొట్టుక పోయాయి. శ్రీరాంకాలనీతో పాటు పాకిజానగర్లో డ్రైనేజీ నిండిపోయి ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. మండలంలో కూడా ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలైన సీబాపు కాలనీ, భట్టుపల్లితో పాటు పలు కాలనీల్లోని ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.