CM Revanth Reddy Vows to Secure: చుక్క నీటినీ వదలొద్దు
ABN , Publish Date - Sep 14 , 2025 | 06:11 AM
నికర జలాలైనా, మిగులు జలాలైనా, వరద జలాలైనా సరే.. తెలంగాణకు చెందాల్సిన నీటి వాటాలో చుక్క నీరు కూడా వదులుకునేది లేదు...
కృష్ణా జలాల్లో ఇంతకాలం జరిగిన అన్యాయానికి అడ్డుకట్ట వేయాలి
గరిష్ఠ వాటా సాధనకు పట్టుబట్టాలి
ఆధారాలన్నీ ట్రైబ్యునల్కు అందించాలి
రాష్ట్రానికి మొత్తం 904 టీఎంసీలు రావాలి
299 టీఎంసీలకు ఒప్పుకొని గత సర్కారు తెలంగాణకు తీరని అన్యాయం చేసింది
కృష్ణా ట్రైబ్యునల్లో తెలంగాణ వాదనలపై ఉన్నతాధికారులకు సీఎం దిశానిర్దేశం
23, 24, 25 తేదీల్లో ట్రైబ్యునల్లో విచారణ
హైదరాబాద్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ‘‘నికర జలాలైనా, మిగులు జలాలైనా, వరద జలాలైనా సరే.. తెలంగాణకు చెందాల్సిన నీటి వాటాలో చుక్క నీరు కూడా వదులుకునేది లేదు. కృష్ణా జలాల్లో గరిష్ఠ నీటి వాటాను సాధించుకునేందుకు పట్టుబట్టాలి. అందుకు అవసరమైన ఆధారాలన్నీ వెంటనే సిద్ధం చేసి, న్యాయ నిపుణులకు అందించాలి. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును దక్కించుకోవాలి. రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటాను సాధించి తీరాలి’’ అని న్యాయ నిపుణులు, నీటి పారుదల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈనెల 23, 24, 25 తేదీల్లో న్యూఢిల్లీలో కృష్ణా జలాల వివాద ట్రైబ్యునల్ విచారణలో తెలంగాణ తుది వాదనలు వినిపించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శనివారం సీఎం రేవంత్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్, కేంద్ర జలవనరుల సంఘం మాజీ చైర్మన్ కుశ్విందర్ వోహ్రా, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్దాస్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, సీఎంవో కార్యదర్శి మాణిక్కరాజ్ కన్నన్, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ అంజద్ హుస్సేన్తో ఆయన సమీక్ష నిర్వహించారు. ట్రైబ్యునల్ ఎదుట అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు బలమైన వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి విచారణకు హాజరవుతారని చెప్పారు. ‘‘ఇంత కాలం కృష్ణా జలాల్లో జరిగిన అన్యాయానికి అడ్డుకట్ట వేయాలి. మనకు రావాల్సిన ప్రతి నీటి బొట్టును దక్కించుకునేలా సమర్థంగా వాదనలు వినిపించాలి. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు, నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులు, అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు, నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టుల వివరాలన్నీ ట్రైబ్యునల్ ముందుంచండి. ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన జీవోలు, మెమోలు, డాక్యుమెంట్లన్నీ సిద్ధంగా ఉంచుకోండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ప్రాజెక్టుల వివరాలన్నీ ట్రైబ్యునల్కు అందించండి’’ అని న్యాయ నిపుణులకు దిశానిర్దేశం చేశారు.
తీరని ద్రోహం చేసిన కేసీఆర్ సర్కార్
కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలను సాధించకపోగా ఏపీకి 512 టీఎంసీలను కట్టబెట్టి, రాష్ట్రానికి 299 టీఎంసీల వాటాకు ఒప్పుకొని గత ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందనే అంశం సమావేశంలో చర్చకు వచ్చింది. ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల్లో తెలంగాణ వాటాగా 299 టీఎంసీలు చాలని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పుకొన్న విషయాన్ని ట్రైబ్యునల్ ముందు ఏపీ ప్రస్తావించిందని న్యాయ నిపుణులు సీఎంకు వివరించారు. దాంతో, ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోకపోవటంతోనే ఈ పరిస్థితి వచ్చిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. గత పదేళ్లపాటు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా జలాల్లో న్యాయంగా రావాల్సిన కోటాను సాధించటంలో దారుణంగా విఫలమైందని తెలిపారు. కృష్ణాపై తలపెట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను పెండింగ్లో పెట్టిందని, నీటి వాటాల విషయంలో తీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు. దిగువ రాష్ట్రాల హక్కులతోపాటు నదీ వాటాల పంపిణీ న్యాయ సూత్రాల ప్రకారం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జలాల్లో మొత్తంగా 904 టీఎంసీల వాటా రావాల్సి ఉందని, అందుకు అనుగుణంగా వాదనలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా, ఉదాసీనంగా వ్యవహరించటంతో ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుపోయిందని, ఆ విషయాన్ని ట్రైబ్యునల్ ముందుకు తీసుకు రావాలని చెప్పారు.
శ్రీశైలం నిండకముందే నీటి తరలింపు
శ్రీశైలం రిజర్వాయర్ నిండకముందే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి కృష్ణా జలాలను ఏపీ ఇతర బేసిన్లకు తరలించుకుపోతోందని సీఎం రేవంత్ చెప్పారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తి చేసుకొని అన్ని ప్రాజెక్టుల ద్వారా శ్రీశైలం నుంచి రోజుకు 10 టీఎంసీలను తరలించేలా ఏర్పాట్లు చేస్తోందని, ఎక్కడ పడితే అక్కడ కాల్వల సామర్థ్యం పెంచుకోవటంతోపాటు పట్టిసీమ, పులిచింతల, చింతలపూడి వరకు అక్రమంగా నీటిని తరలిస్తున్న అంశాలన్నీ ఆధారాలతో సహా ట్రైబ్యునల్కు నివేదించాలని, అందుకు సన్నద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. కృష్ణా నీటిని శ్రీశైలం నుంచి ఏపీ అక్రమంగా మళ్లించటంతో శ్రీశైలం, నాగార్జున సాగర్తోపాటు పులిచింతల వద్ద ఉన్న జల విద్యుత్తు ప్రాజెక్టులు మూత పడే ప్రమాదం ముంచుకువచ్చిందన్నారు. తక్కువ ఖర్చుతో ఉత్పత్తయ్యే జల విద్యుత్తు ఉత్పత్తికి ఏపీ చర్యలతో విఘాతం కలుగుతోందన్నారు. ఈ విషయాలనూ ట్రైబ్యునల్ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు కృష్ణా జలాలు తప్ప ఇతర గత్యంతరం లేదనే విషయాన్ని ట్రైబ్యునల్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. తెలంగాణ తరఫున వాదనలు వినిపించేందుకు ఇదే సరైన అవకాశమని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంతోపాటు కృష్ణా నదీ జలాల్లో రావాల్సిన వాటాల భవిష్యత్తును దిశానిర్దేశం చేేస వాదనలు కావటంతో ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో జారవిడుచుకోవద్దని సూచించారు.