Chief Minister Revanth Reddy: సమ్మక్క-సారలమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరణ
ABN , Publish Date - Dec 22 , 2025 | 05:27 AM
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే వనదేవతల మహాజాతర పోస్టర్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆవిష్కరించారు...
జనవరి 28 నుంచి 31 వరకు ఉత్సవం నిర్వహణ
హైదరాబాద్, ములుగు, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే వనదేవతల మహాజాతర పోస్టర్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో ఆదివారం ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మంత్రులు పొంగులేటి శ్రీనివా్సరెడ్డి, ధనసరి సీతక్క, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్లతో కలిసి ఈ పోస్టర్ను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 28-31 వరకు మేడారంలో సమ్మక్క-సారలమ్మ మహాజాతర జరగనుందన్నారు. జనవరి 28(బుధవారం) సాయంత్రం 6 గంటలకు సారలమ్మ కన్నెపల్లి నుంచి మేడారం గద్దెకు చేరుకుంటుంది. సారలమ్మతో పాటు గోవిందరాజు, పగిడిద్దరాజు వస్తారు. 29న (గురువారం) సాయంత్రం 5గంటలకు సమ్మక్క చిలకల గుట్ట నుంచి గద్దెలకు బయల్దేరుతుంది. 30న (శుక్రవారం) భక్తులకు వనదేవతలు గద్దెలపై కొలువై సంపూర్ణదర్శనం ఇస్తారు. 31న (శనివారం) సాయంత్రం వనదేవతలు వనప్రవేశం చేస్తారు. దీంతో మహాజాతర ముగుస్తుందని వివరించారు. మహా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో ములుగు కలెక్టర్ దివాకర పాల్గొన్నారు.