CM Revanth Reddy: తక్కువ వడ్డీతో రుణాలివ్వండి
ABN , Publish Date - Dec 02 , 2025 | 05:30 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ, రీజినల్ రింగు రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణాలకు తక్కువ వడ్డీతో...
ఫ్యూచర్సిటీ, మెట్రో విస్తరణ, ఆర్ఆర్ఆర్లకు చేయూతనివ్వండి
గతంలో ఇచ్చిన అప్పులను పునర్వ్యవస్థీకరించండి
10 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు త్వరితగతిన రుణాలు ఇవ్వండి
హడ్కో చైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠతో సీఎం రేవంత్
హైదరాబాద్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ, రీజినల్ రింగు రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణాలకు తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. హడ్కో చైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠను కోరారు. సంజయ్ కులశ్రేష్ఠ సోమవారం ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరు, అమరావతి మీదుగా చెన్నై వరకు గ్రీన్ ఫీల్డ్ రహదారులు, బందరు పోర్టు వరకు నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రహదారి, బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టులపై వారి మధ్య చర్చ జరిగింది. గతంలో అధిక వడ్డీ రేటుతో ఇచ్చిన రుణాలను ప్రస్తావిస్తూ.. వాటిని రీస్ట్రక్చర్ చేయాలని (పునర్వ్యవస్థీకరించాలని) సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీనికి సంజయ్ కులశ్రేష్ఠ సానుకూలంగా స్పందించారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే రుణాలు మంజూరు చేశామని గుర్తు చేశారు. మరో 10 లక్షల ఇళ్ల నిర్మాణాలకు కూడా రుణాలు త్వరితగతిన మంజూరు చేయాలని సీఎం రేవంత్రెడ్డి ప్రతిపాదించారు. ఈ నెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ‘భారత్ గ్లోబల్ సమ్మిట్’కు హాజరు కావాలని హడ్కో చైర్మన్ను సీఎం ఆహ్వానించారు. ఈ సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్సరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.