CM Revanth Reddy: రెండు రోజుల వేడుకలు.. రెండేళ్ల విజయోత్సవాలుగా
ABN , Publish Date - Nov 23 , 2025 | 07:10 AM
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలని, ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తికావస్తున్నందునా...
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలి
అధికారులకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలని, ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తికావస్తున్నందునా... ఆ రెండు రోజుల వేడుకలు రెండేళ్ల విజయోత్సవాలను ప్రతిబింబించేలా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకోవడంతో పాటు రైజింగ్ డాక్యుమెంట్లో పొందుపరిచే ప్రతి అంశంపై లోతైన అధ్యయనం చేయాలని సూచించారు. తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో క్రియాశీల పాత్ర పోషించాల్సిన అన్ని విభాగాలు ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’లో పాలుపంచుకోవాలని కోరారు. ఫ్యూచర్ సిటీలో డిసెంబరు 8, 9 తేదీల్లో నిర్వహించాల్సిన గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి శనివారం సీఎంవో అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎంవో ముఖ్యకార్యదర్శి శేషాద్రితో పాటు ఇతర అధికారులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలను దిశానిర్దేశం చేేస ఈ డాక్యుమెంట్లో పొందుపరిచిన అంశాలపై సంబంధిత విభాగాలతో ఈనెల 25 నుంచి వరుసగా సమీక్షలు చేయనున్నట్లు సీఎం తెలిపారు. అభివృద్ధిలో కీలకమైన రంగాలు, అందులో పాలుపంచుకునే అనుసంధాన విభాగాలన్నింటితో ఒక్కో సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లతో పాటు రెండేళ్ల ప్రగతి, తెలంగాణ రైజింగ్ 2047లో ఆయా విభాగాల పాత్రపై ప్రధానంగా సమీక్ష జరుపుతామన్నారు. ఇప్పటికే ప్రజల అభిప్రాయాలు, సలహాలు సూచనలతో పాటు అన్ని రంగాల్లోని నిపుణుల దూరదృష్టితో తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ 2047 రూపకల్పన జరిగిందని సీఎం తెలిపారు. ఈ సమీక్షల్లో వచ్చే మరిన్ని విలువైన సలహాలు, నిర్దిష్టమైన సూచనలతో డాక్యుమెంట్కు తుదిరూపం ఇస్తామని చెప్పారు.
9న తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ ఆవిష్కరణ
డిసెంబరు 8న ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేస్తున్న పథకాల విజయాలను చాటి చెప్పాలని, డిసెంబరు 9న తెలంగాణ భవిష్యత్తు దార్శనికత, ప్రణాళికలను పొందుపరిచిన ‘తెలంగాణ రైజింగ్-2047 డాక్యుమెంట్’ను ఆవిష్కరించే కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇదే ప్రాంగణంలో తెలంగాణలో పారిశ్రామిక విధానాన్ని, పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యాలను ప్రపంచానికి చాటిచెప్పేలా రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా నిర్వహించాలని సూచించారు. అన్ని విభాగాలు తమ భవిష్యత్తు లక్ష్యాలన్ని కళ్లకు కట్టించే ఆడియో, వీడియో ప్రదర్శనలు, ప్రజంటేషన్లు తయారు చేసుకోవాలని చెప్పారు. దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు, అన్ని రంగాల్లో పేరొందిన పారిశ్రామికవేత్తలను ప్రత్యేకంగా ఆహ్వానించాలని ఆదేశించారు. వేడుకలకు వచ్చిన అతిథులకు తగిన వసతి సదుపాయాలతో పాటు అత్యున్నత భద్రత కల్పించాలని, ఏర్పాట్లలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడడంతో పాటు అన్ని విభాగాలు సమన్వయంతో ఈ వేడుకలను విజయవంతం చేయాలని అన్నారు.