నారసింహుడికి చక్రతీర్థ స్నానం
ABN , Publish Date - Mar 11 , 2025 | 01:02 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం పదో రోజుకు చేరుకున్నాయి

వసంతోత్సవ శోభతో వెల్లివిరిసిన యాదగిరిక్షేత్రం
కొనసాగుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం పదో రోజుకు చేరుకున్నాయి. కొండపైన విష్ణు పుష్కరిణిలో సుదర్శనచక్ర అళ్వార్ల చక్రతీర్థ స్నానాలు, యాగశాలలో మహాపూర్ణాహుతి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. సాయంత్రం ఆలయంలో పుష్పయాగము, దేవతా ఉధ్వాసము, రాత్రి వేళ దోపోత్సవ పర్వాలు ఆగమశాస్త్ర రీతిలో వైభవంగా కొనసాగాయి.
- (ఆంధ్రజ్యోతి,యాదగిరిగుట్ట)
విశ్వరకక్షకుడు నృసింహుడి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చేపట్టిన ప్రతి వేడుక మం గళ ప్రదమే. విశ్వశాంతి, లోకకల్యాణార్థం సదా పరమాత్ము డి ప్రార్థించుచూ భక్తజన కోటిని సంరక్షింపమని ఆహ్వానించిన 33వేల కోట్ల దేవతలను ఉత్సవ పరిసమాప్తిగా స్వస్తత చెందమని ఆయా దేవతల మంత్ర పఠనాలతో యజ్ఞహవిస్సును అందజేసి యాగ పరిసమాప్తి కోసం మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధానార్చక బృందం పాంచరాత్రగమ శాస్త్ర రీతిలో ఆలయ ఉత్తర తిరువీధి యాగశాలలో చతుస్థానార్చన పూజలు జరిపి వేదమంత్రాలతో మహాపూర్ణాహుతి నిర్వహించారు.
చక్రతీర్థ స్నానాలు (వసంతోత్సవ కేళి)
వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఉత్సవాంతముగా జరిపే పర్వం (చక్రతీర్థ అళ్వార్ల) చక్రతీర్థ మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. కల్యాణమూర్తులను దివ్యమనోహరముగా అలంకరించిన పూజారులు ఆయుధ రాజమైన సుదర్శన చక్రములను ప్రత్యేక పల్లకీ సేవలో వేదికపై తీర్చిదిద్దారు. ఉత్సవాలలో ప్రాధా న్యం గల చక్రతీర్థ స్నానంతో పాటు వైదిక కార్యక్రమాలు చేపట్టారు. తొలత పుణ్యవాచన పూజలు నిర్వహించిన పూజారులు వసంతకేళి జరిపారు. అనంతరం వేదమంత్రాలు, మంగళవాయిద్యాల మధ్యచక్రత్ ఆళ్వర్ల అవబృత స్నాన ఘట్టాలు కొనసాగాయి. మంగళవాయిద్యాలు, మేళా తాళాల నడువ అత్యంత వైభవముగా అర్చకులు, అశేష భక్తజనులు, దేవస్థాన సిబ్బంది తిరువీధి సేవోత్సవంలో పసుపు, కుంకుమ, గంధం, వివిధ సుగంఽధాలు వెదజల్లే రంగుల్లో వసంత కేళి నిర్వహించారు. ఉత్సవాల్లో కలెక్టర్ ఎం. హనుమంతరావు దంపతులు, ఆలయ అనువంశిక ధర్మకర్త భాస్కరాయణీ నర్సింహమూర్తి, ఈవో ఏ. భాస్కర్రావు, డీఈవో దోర్భల భాస్కరశర్మ, ఏఈవోలు ప్రతాప నవీన్కుమార్శర్మ, జూశెట్టి క్రిష్ణ, గజ్వేల్లి రమే్షబాబు, రఘు, పర్యవేక్షకులు నాగుల మహే్షగౌడ్, దీరావత్ రామరావునాయ క్,రాజన్బాబు, వెంకటేశ్వర్లు, నరేష్, రాకే్షరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా శ్రీ పుష్పయాగం, దోపోత్సవం
బ్రహ్మోత్సవాల్లో శ్రీవారికి నిర్వహించే ఉత్సవ వైశిష్ట్యమే శ్రీ పుష్పయాగం, దేవతోద్వాసన, దోపోత్సవం సోమవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. వేద మంత్ర పఠనాలు, ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాల నడుమ సర్వజగద్రక్షకుడైన మహావిష్ణు సుస్వరూపుడైన లక్ష్మీనృసింహుడిని వివిధ రకాల పూలతో సహస్రనామాలతో అర్చించే పర్వమే శ్రీ పుష్పయాగము. అతివృష్టి, అనావృష్టి, దుర్భిక్షములు కలగకుండా విశ్వమంత సుభిక్షంగా ఉండేందుకు శ్రీదేవి, భూదేవి సహితుడైన స్వామివారిని సకల విధ పుష్పరాజములతో పండితుల వేదమంత్ర పఠనాలు, అష్టవిధ రాగ తాళాలతో జరిపే పర్వమే శ్రీ పుష్పయాగము. మద్భాగవతములో గజేంద్రుడు అర్చించిన పుష్పార్చనల వైభవాలను తెలుపుతూ భగవంతుడిని వేడుకొను పుష్పయాగ ప్రక్రియ ఎంతో ఆనందభరితమైనది.
అలరించిన ధార్మిక, సాహిత్య, సంగీత సభలు
సోమవారం సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వర కు లిటిల్ మ్యూజీషయన్స్ అకాడమి వ్యవస్థాపకుడు, ప్ర ముఖ గాయకుడు, సంగీత దర్శకుడు కోమాండూరి రామాచార్యులు శిష్య బృందం సినీ నేపథ్య గాయకుల భక్తి సంగీ త విభావరి భక్తులను అలరించింది. అదేవిధంగా శ్రీవైష్ణవ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రభాతబేరి నిర్వహించారు. శ్రీవైష్ణవులు, అర్చకులు, పారాయణీకులు సామూహికంగా విష్ణుసహస్ర నామ స్త్రోత పారాయణాలు జరిపారు.
గవర్నర్ పర్యటన సాగిందిలా..
గవర్నర్ రోడ్డు మార్గంలో క్షేత్ర పర్యటనకు వచ్చారు. సుమారు గంట పాటు గవర్నర్ పర్యటన సాగింది. గవర్నర్కు ముందుగా కలెక్టర్ ఎం. హనుమంతరావు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ప్రోటోకాల్ కార్యాలయం వద్ద పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అతిథి గృహం నుంచి ఎలక్ట్రికల్ వాహనంలో తూర్పు రాజగోపురం చేరుకున్నారు. త్రితల రాజగోపురం ద్వారా ఆలయంలోకి ప్రవేశించారు. ముందుగా క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామిని దర్శించుకోగా ఆలయ పూజారులు గవర్నర్కు పూర్ణకుంభ స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వయంభువులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ముఖ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అనువంశిక ధర్మకర్త భాస్కరాయణీ నరసింహమూర్తి లడ్డు ప్రసాదం, ఈవో ఏ. భాస్కర్రావు స్వామివారి చిత్రపటం అందజేశారు. ఆలయ పశ్చిమ రాజగోపురం ద్వారా ప్రాకార మండపం లోపల తిరుమాడ వీధుల నుంచి త్రితల రాజగోపురం చేరుకొని అక్కడి స్వర్ణ దివ్య విమాన రాజగోపురాన్ని దర్శించుకున్నారు. తొడుగుల తయారీ తీరు వ్యయం, సమయం తదితర అంశాలపై కలెక్టర్ వివరించగా ఈవోను అభినందించారు.
మహా పూర్ణాహుతిలో పాల్గొనడం అదృష్టం : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో నిర్వహించిన మహా పూర్ణాహుతిలో తాను పాల్గొన డం అదృష్టంగా భావిస్తున్నట్లు గవర్నర్ జిష్ణుదేవ్వర్మ అన్నారు. యాదగిరిగుట్ట క్షేత్ర సందర్శనకు సోమవారం వచ్చిన సందర్భంలో గర్భాలయంలోని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ ఉత్తర తిరువీధిలోని యాగశాలలో జరిగిన మహాపూర్ణాహుతిలో పాల్గొని గవర్నర్ మాట్లాడారు. స్వామివారి దర్శించుకునేందుకు మరోసారి ఇక్కడే బస చేస్తానన్నారు. ఇంకొసారి క్షేత్ర పర్యటనకు వస్తున్నట్లు వివరించారు. స్వామివారి దర్శనం భాగ్యం కలగడం పూర్వ జన్మసుకృతమన్నారు.
నేడు ఉత్సవాల పరిసమాప్తి
స్వామివారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు మంగళవారం పరిసమాప్తముతాయి. ఉదయం 10 గంటలకు అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 9 గంటలకు స్వామి వారి శృంగార డోలోత్సవంతో 11 రోజులుగా అత్యంత వైభవంగా కొనసాగిన బ్రహ్మోత్సవాలు సమాప్తం అవుతాయి.
పట్టు వస్త్రాల సమర్పణ ప్రోటోకాల్కు విరుద్దమని బీఆర్ఎస్ ఆరోపణ
బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి కాంగ్రెస్ నాయకులు పట్టు వస్త్రాలు ఎలా సమర్పిస్తారని బీఆర్ఎస్ శ్రేణులు సోమవారం నిరసన తెలిపాయి. ప్రోటోకాల్కు విరుద్దంగా పట్టు వస్త్రాల ఎలా అందజేస్తారని టెస్కాబ్ మాజీ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి ఆరోపించారు. యాదగిరికొండపై బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఈవో దృష్టికి పలు విషయాలు తెచ్చారు. ప్రోటోకాల్కు సంబంధం లేని వ్యక్తులతో స్వామివారికి పట్టువస్త్రాలు ఇప్పించారని ఈవోను నిలదీశారు. ఇలాంటి చర్యలతో మాజీ సీఎం కేసీఆర్ ఆనావాళ్లను చేరిపివేయలేరన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే సురక్ష సిబ్బందిని తొలగించారని ఆరోపించారు. దేవస్థానం తరపున ఆహ్వానాలు అందించిన విషయంలో గౌరవ మర్యాదలకు ఎలాంటి లోటు జరగలేదని ముఖాముఖి ఈవో భాస్కర్రావు వివరణ ఇచ్చారు. ప్రోటోకాల్ వర్తించని వ్యక్తులెవరు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించలేదని, వ్యక్తిగతంగా తెచ్చిన పట్టువస్త్రాలు మాత్రమే స్వామికి అందజేశారని ఈవో తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, కసావు శ్రీనివాస్, గడ్డమీది రవీందర్, ఇమ్మిడి రాంరెడ్డి, బూడిద సురేందర్ పాల్గొన్నారు.