ఎడ్ల పందేలకు పెరుగుతున్న ఆదరణ
ABN , Publish Date - Apr 08 , 2025 | 12:17 AM
గ్రామాల్లో నిర్వహించే జాతరలు, ఉత్సవాల్లో ఎడ్ల పందేలకు ఆదరణ పెరుగుతోందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి అన్నారు.
తెలుగు రాష్ట్రాల స్థాయి ఎడ్ల పందేలు ప్రారంభించిన ఎమ్మెల్యే జైవీర్రెడ్డి
తిరుమలగిరి(సాగర్), ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో నిర్వహించే జాతరలు, ఉత్సవాల్లో ఎడ్ల పందేలకు ఆదరణ పెరుగుతోందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా నల్లగొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలకేంద్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి ఎద్దుల పందేల పోటీలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో పండుగను నిర్వహించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పందేల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్లోని అమరావతి, పల్నాడు, కృష్ణా, తెలంగాణలోని నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు చెందిన ఎనిమిది ఎద్దుల జతలను సంబంధిత యజమానులు తీసుకొచ్చారు. పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. కార్యక్రమంలో హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి శేఖర్రెడ్డి, వైస్ చైర్మన్ కలసాని చంద్రశేఖర్, మార్కెట్ డైరెక్టర్ శాగం మంగమ్మ, ఏసీపీ చవ్వా శంకర్రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ శాగం నాగిరెడ్డి, కాంగ్రెస్ నాయకుడు శాగం పెద్దిరెడ్డి, మాజీ ఎంపీపీ ఆంగోతు భగవాన్నాయక్, శ్రవణ్కుమార్రెడ్డి, గురునాధం, బద్దెల వెంకన్న, లాలునాయక్, భద్రినాయక్, చింతల చంద్రారెడ్డి పాల్గొన్నారు.