Political Protest: కేసీఆర్ను బద్నాం చేసే కుట్ర
ABN , Publish Date - Sep 03 , 2025 | 04:58 AM
కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల అంశాన్ని సీబీఐ విచారణకు అప్పగించాలన్న రాష్ట్రప్రభుత్వ నిర్ణయం పై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి...
కాళేశ్వరం అంశాన్ని సీబీఐకి అప్పగించడంపై బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్): కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల అంశాన్ని సీబీఐ విచారణకు అప్పగించాలన్న రాష్ట్రప్రభుత్వ నిర్ణయం పై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. కేసీఆర్ను బద్నాం చేసేందుకు కాంగ్రెస్ కుట్రపన్నిందంటూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనల కు దిగాయి. సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలను దహ నం చేసి నిరసన తెలిపాయి. పలుచోట్ల బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. తోపులాట, ఉద్రిక్తత చోటు చేసుకున్నాయి. మహబూబాబాద్ జిల్లా కురవిలో జాతీయ రహదారిపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోతు కవిత ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. మహబూబాబాద్లో వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి వెళుతున్న మంత్రుల దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివా్సరెడ్డి కాన్వాయ్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని తప్పించి కా న్వాయ్ను పంపించారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూరు బస్టాండ్ సెంటర్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. విచారణ పేరిట కాళేశ్వరం ప్రాజెక్టును పక్కనపెట్టి, గోదావరి జలాలను ఏపీకి తరలించే కుట్ర జరుగుతోందని ఎర్రబెల్లి ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్లోని బాలాపూర్ చౌరస్తాలో మాజీ మంత్రి సబితారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా, ర్యాలీ నిర్వహించారు. సీబీఐ విచారణ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును పక్కనబెట్టి.. గోదావరి జలాలను ఏపీలోని బనకచర్లకు అక్రమంతా తరలించుకు వెళ్లడానికి సీఎం రేవంత్రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి నిరంజన్రెడ్డి, నాగర్కర్నూల్లో మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, జడ్చర్లలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేశాయి. సంగారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఆసిఫాబాద్లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. జగిత్యాలలో కార్యకర్తలు కళ్లకు గంత లు కట్టుకొని రాస్తారోకో నిర్వహించారు. సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ కట్టపై ‘ఇది కాదా కాళేశ్వరం.. ఇదే కదా కాళేశ్వరం’ నినాదంతో ఉన్న 100 మీటర్ల బ్యానర్ను ప్రదర్శించారు.