Ponguleti Srinivas Reddy: పంచాయతీపై నవ్వు తెప్పిస్తున్నబీఆర్ఎస్ పింక్ లెక్కలు
ABN , Publish Date - Dec 19 , 2025 | 04:53 AM
గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై తన పింక్ పేపర్ లెక్కలు చూపుతున్న బీఆర్ఎ్సని చూస్తుంటే నవ్వొస్తుందని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు...
రెండేళ్ల పాలనతో గ్రామాల్లోకి కాంగ్రెస్
కొత్తగూడెం జిల్లాలో నూతన సర్పంచ్ల సన్మాన సభలో మంత్రి పొంగులేటి
ఉపాధి పథకం పేరు మార్పు.. గాంధీని అవమానించడమేనని వ్యాఖ్య
చుంచుపల్లి/హైదరాబాద్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై తన పింక్ పేపర్ లెక్కలు చూపుతున్న బీఆర్ఎ్సని చూస్తుంటే నవ్వొస్తుందని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు తెలంగాణలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రె్సదే విజయమన్నారు. గురువారం భద్రాద్రి- కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికైన సర్పంచ్లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులను మంత్రి పొంగులేటి సన్మానించారు. ఈ సభకు డీసీసీ అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న అధ్యక్షత వహించారు. ఈ సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ప్రతిపక్ష బీఆర్ఎస్ తన పింకు కలర్ పేపర్లో తమకే ఎక్కువ సీట్లు వచ్చాయని ప్రింట్ వేయించుకుంటోందని, కానీ అవి కేవలం పేపర్ పైనే ఉంటాయన్నారు. వారి సిద్ధాంతాలను చూస్తుంటే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు. రెండేళ్లలో సాధించిన ఫలితాల వల్లే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడిందన్నారు. కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో సీపీఐ మిత్రపక్షంగా ఉన్నా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్నేహ పూర్వక పోటీలు ఎదుర్కొన్నా, అద్భుతమైన ఫలితాలొచ్చాయని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
పేరు తీసేస్తే చరిత్ర మారుతుందా
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తీసేయడం ఆయను అవమానించడమేనని.. అయినా ఆయన పేరు తీసేసినంత మాత్రాన చరిత్ర మారుతుందా? అని మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. ఈ పథకానికి వికసిత్ భారత్-గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ (వీబీ-జీ-రామ్జీ)గా మార్చడం అన్యాయమని ఓ ప్రకటనలో తెలిపారు. తక్షణం ప్రభుత్వం ఈ పేరు మార్పు నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు.