BRS MLA Harish Rao criticized: అసెంబ్లీలో సీఎంది చిల్లర, చిచోరా భాష
ABN , Publish Date - Dec 29 , 2025 | 01:49 AM
రెండేళ్లలో అన్ని వ్యవస్థలనూ భ్రష్టుపట్టించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రాజ్యాంగబద్ధమైన అసెంబ్లీ వ్యవస్థను సైతం తప్పుదోవ పట్టిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు...
కాంగ్రె్సకు హుందాతనం లేదు: హరీశ్
హైదరాబాద్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రెండేళ్లలో అన్ని వ్యవస్థలనూ భ్రష్టుపట్టించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రాజ్యాంగబద్ధమైన అసెంబ్లీ వ్యవస్థను సైతం తప్పుదోవ పట్టిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు. ప్రజా సమస్యలను విస్మరించి.. కేవలం బీఆర్ఎ్సపై బురదజల్లేందుకే శాసనసభ సమావేశాలు నిర్వహించడం దుర్మార్గమన్నారు. సభను హుందాగా నడుపుదామంటూ గొప్పలు చెప్పే కాంగ్రెస్ నేతలకు అసలు హుందాతనమే లేదని అన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి తన ప్రసంగాల్లో చిల్లర, చిచోరా భాష ఉపయోగించి సభా గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని హరీశ్ విమర్శించారు. ఆదివారం బీఆర్ఎ్సఎల్పీలో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో ఏటా సగటున 32 రోజులు అసెంబ్లీ నడిపితే.. కాంగ్రెస్ రెండేళ్లలో 40రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహించిందని చెప్పారు. ఈసారి కనీసం 15రోజులైనా సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నుంచి ఒక్కరికే మాట్లాడే అవకాశమిచ్చి ప్రధాన ప్రతిపక్షం గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కచ్చితంగా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చ జరగాలని, సభను 15 రోజులపాటు నడపాలని కోరారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా.. ఇప్పటి వరకు కాంగ్రెస్ సర్కారు అసెంబ్లీ హౌస్ కమిటీలు వేయలేదని హరీశ్ విమర్శించారు.