BRS chief K. Chandrashekar Rao: పార్టీ గుర్తుతో ఎన్నికలొస్తే గెలుపు మనదే!
ABN , Publish Date - Dec 22 , 2025 | 05:21 AM
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ వైపే నిలిచారని, ఎన్నికల ఫలితాలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు....
పంచాయతీ ఎన్నికల్లో జనం మనవైపే
కాంగ్రె్స పార్టీకి గ్రామీణ ప్రజలు తగిన బుద్ధి చెప్పారు
బీఆర్ఎ్సఎల్పీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో కేసీఆర్ వ్యాఖ్య
సభ్యత్వాల నమోదు, పార్టీ కమిటీలపై చర్చ
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ వైపే నిలిచారని, ఎన్నికల ఫలితాలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లోనే ఫలితాలు ఇలా ఉంటే.. పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎ్సకు తిరుగులేదంటూ.. పార్టీ శ్రేణుల్లో ఆయన జోష్ పెంచారు. గర్వంతో ఎగిరే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గ్రామీణ ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, రెండేళ్లలో కాంగ్రెస్ సర్కార్ ఒక కొత్త పాలసీ కూడా తీసుకురాలేదని.. ఉన్న పథకాలు ఆపేసిందని విమర్శించారు. చాలాకాలం తర్వాత కేసీఆర్ ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎ్సఎల్పీ, పార్టీ కార్యవర్గ సభ్యులతో సమావేశమయ్యారు. పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు, పంచాయతీ ఎన్నికల ఫలితాలు, సభ్యత్వాల నమోదు, కమిటీల ఏర్పాటు, సాగునీటి ప్రాజెక్టుల అంశాలతోపాటు తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సమీక్ష జరిపినట్లు సమాచారం. ఈ సందర్భంగా కేసీఆర్ మాటాడుతూ.. బీఆర్ఎస్ మద్దతుదారులకు ప్రజలు ఓట్లేసి గెలిపించి కాంగ్రెస్ సర్కార్పై ఉన్న వ్యతిరేకత బయటపడిందని అన్నట్లు తెలిసింది. రానున్న మునిసిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించనుందని ధీమా వ్యక్తం చేశారు. 2026 మొత్తం ఎన్నికల సంవత్సరంగా ఉండబోతోందని, పారీ ్టశ్రేణులన్నీ ఇప్పటినుంచే సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రతిపక్షాలతో ఎలా వ్యవహరించాలో కాంగ్రెస్ తమకు నేర్పిస్తోందని, భవిష్యత్తులో తాము కూడా అదేవిధంగా వ్యవహరిస్తామని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. త్వరలోనే పార్టీ సభ్యత్వ నమోదు, ఆ వెంటనే అన్నిస్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ ప్రకటించినట్లు తెలిసింది. ఎన్డీఏ కూటమిలో కీలకంగా మారిన ఏపీ సీఎం చంద్రబాబు అన్ని విధాలా కేంద్ర ప్రభుత్వాన్ని వాడుకుంటున్నారని.. తెలంగాణకు నష్టం కలిగించేలా కుట్రలకు పాల్పడుతున్నారని సమావేశంలో కేసీఆర్ ఆరోపించినట్లు సమాచారం. కాగా, ఉప్పల్ నియోజకవర్గంలోని పలువురు ఎంబీబీఎస్ విద్యార్థుల విద్యాభ్యాసానికి అయ్యే ఖర్చును ఎమ్మెల్యే భండారి లక్ష్మారెడ్డి భరిస్తున్నారు. ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆదివారం ఆ విద్యార్థులకు చెక్కులను అందజేశారు.