Share News

Former minister Harish Rao slammed CM Revanth Reddy: రేవంత్‌ అట్టర్‌ ఫ్లాప్‌ సీఎం

ABN , Publish Date - Nov 08 , 2025 | 02:43 AM

సీఎం రేవంత్‌రెడ్డికి బ్లాక్‌మెయిల్‌ చేయడమే తప్ప పాలన ఏమాత్రం చేతకాదని, ఆయన అట్టర్‌ఫ్లాప్‌ సీఎం అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్‌ పాలనలో...

Former minister Harish Rao slammed CM Revanth Reddy: రేవంత్‌ అట్టర్‌ ఫ్లాప్‌ సీఎం

  • బ్లాక్‌మెయిల్‌ తప్ప పాలన చేతకాదు.. ఫీజు బకాయిలు అడిగితే యాజమాన్యాలపై విజిలెన్స్‌ దాడులు

  • జూబ్లీహిల్స్‌లో కాంగ్రె్‌సకు బుద్ధి చెబితే రాష్ట్రమంతటా ప్రజలకు మేలు

  • ‘మీట్‌ ది ప్రెస్‌’లో హరీశ్‌రావు

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డికి బ్లాక్‌మెయిల్‌ చేయడమే తప్ప పాలన ఏమాత్రం చేతకాదని, ఆయన అట్టర్‌ఫ్లాప్‌ సీఎం అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో వికాసం జరిగితే.. రేవంత్‌ పాలనలో విధ్వంసం జరుగుతోందని మండిపడ్డారు. రేవంత్‌ పాలనలో ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరని, కేవలం నలుగురు రేవంత్‌ బ్రదర్స్‌ మాత్రమే సంతోషంగా ఉన్నారన్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్‌ది ప్రెస్‌లో హరీశ్‌రావు మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ హయాంలో విద్యార్థులకు రూ.19,500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్తిస్తే.. గత రెండేళ్లలో సీఎం రేవంత్‌ వారికి కనీసం రెండు రూపాయలు కూడా ఇవ్వలేదన్నారు. ఫీజు బకాయిలు అడిగిన కాలేజీలపై విజిలెన్స్‌, పోలీసులతో దాడులు చేయిస్తుండ టం సిగ్గుచేటని మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రులకు రూ.1,900 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయని, వాటి గురించి అడిగినా విజిలెన్స్‌ దాడు లు చేయిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో చెరువు ల్లో కడుతున్న 11 పెద్ద ప్రాజెక్టులను ఆపుతామని అప్పట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారని.. తర్వాత ఏం సెటిల్‌మెంట్‌ జరిగిందోగానీ అందరూ సైలెంట్‌ అయ్యారన్నారు. కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉపఎన్నికలో సీఎం రేవంత్‌రెడ్డి అనేక హామీలు ఇచ్చి మోసం చేశారని, ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో హామీలు ఇస్తున్నారని విమర్శించారు. పీజేఆర్‌కు మంత్రి పదవి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి, ఆయన మరణానికి కారణమైంది కాంగ్రెస్‌ కాదా అని ప్రశ్నించారు. రేవంత్‌కు జూబ్లీహిల్స్‌లో ఓటమి భయం పట్టుకుందని.. అందుకే పథకాలు ఆగిపోతాయంటూ ప్రజలను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని మండిపడ్డారు.


రాష్ట్రంలో పట్టపగలే హత్యలు

రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ అధ్వానమైపోయిందని, పట్టపగలే నడిరోడ్లపై హత్యలు జరుగుతున్నాయని హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్‌ రాష్ట్రం లో అగ్రికల్చర్‌ పెంచితే, రేవంత్‌రెడ్డి గన్‌కల్చర్‌ పెంచారని ఆరోపించారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 189 హత్యలు జరిగాయని, అందులో 88 హత్యలు నడిరోడ్డుపై, అందరూ చూస్తుండగా జరిగాయని పేర్కొన్నారు. సైబరాబాద్‌లో 41ు, హైదరాబాద్‌లో 60ు, తెలంగాణ మొత్తంగా 22ు నేరాల రేటు పెరిగిందని పోలీసుశాఖ నివేదికే చెబుతోందన్నారు. ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యం కాదా అని నిలదీశారు. రేవంత్‌ రాక్షస పాలన చూసి రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు తరలిపోతున్నాయని, రియల్‌ ఎస్టేట్‌ పడిపోయిందని ఆరోపించారు.

ఎప్పుడూ మాది ప్రజల పక్షమే..

ఆరు గ్యారెంటీలు, ఇతర హామీలపై తాము గల్లాపట్టి అడిగితేనే కాంగ్రెస్‌ ప్రభుత్వం స్పందిస్తోందని హరీశ్‌రావు పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ పోరాటంతోనే రెండుసార్లు రైతులకు రైతుబంధు వచ్చిందన్నారు. గురుకులాల సమస్యలు, హైడ్రా, హెచ్‌సీయూ భూములు, టిమ్స్‌ ఆస్పత్రుల విషయంలో, బస్తీ ఉద్యోగుల కోసం, ప్రజల కోసం ప్రభుత్వాన్ని నిలదీసింది బీఆర్‌ఎస్‌ మాత్రమేనని చెప్పారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. తమది ప్రజల పక్షమేనన్నారు. జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌నయాదవ్‌ సోదరుడు వెంకట్‌ యాదవ్‌కు మూడు ఓట్లు ఉన్నాయని, దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు ఆయనపై చర్యలు లేవని విమర్శించారు. కాంగ్రెతోనే ముస్లింలకు గౌరవమంటూ తప్పుడు వ్యాఖ్యలు చేసిన రేవంత్‌రెడ్డి వెంటనే ముస్లింలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ముస్లింలు స్వాతంత్య్రం కోసం యుద్థం చేసినప్పుడు కాంగ్రెస్‌ ఎక్కడుందని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ నిలదీయడంతోనే అజారుద్దీన్‌కు మంత్రి పదవి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.


జూబ్లీహిల్స్‌ ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం

జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతపై సీఎం రేవంత్‌ దారుణంగా మాట్లాడుతున్నారని, ఆయన పిల్లల మీద కేసులు పెట్టి వేధిస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణలో ప్రస్తుతం రెండే టీమ్‌లు ఉన్నాయన్నారు. ఒకటి ఆరు గ్యారెంటీలు ఎగ్గొడుతున్న టీమ్‌.. మరొకటి వాటిని అమలు చేయాలని పోరాడుతున్న తమ టీమ్‌ అని చెప్పారు. ఆత్మసాక్షిగా ఓటువేసి కాంగ్రె స్‌కు బుద్ధి చెప్పాలని జూబ్లీహిల్స్‌ ఓటర్లకు పిలుపునిచ్చారు. అన్ని సర్వేలు బీఆర్‌ఎస్‌ గెలుస్తుందని స్పష్టం చేస్తున్నాయని, జూబ్లీహిల్స్‌లో నిశ్శబ్ద విప్లవం వస్తుందని పేర్కొన్నారు. కాగా, శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని కొల్లూరు డబుల్‌బెడ్రూం ఇళ్ల సముదాయంలో బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మాగంటి సునీతకు ఓటు వేసి కేసీఆర్‌ రుణం తీర్చుకోవాలని స్థానికులకు హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు.

Updated Date - Nov 08 , 2025 | 02:43 AM