BJP Urges Governor: హిల్ట్ పాలసీ నిలిపివేతకు ఆదేశించండి
ABN , Publish Date - Dec 02 , 2025 | 05:00 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన హిల్ట్(హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్)పాలసీని తక్షణం నిలిపివేసేలా...
గవర్నర్కు బీజేపీ నేతల వినతి
హిల్ట్, జీహెచ్ఎంసీ విస్తరణకు వ్యతిరేకంగా 7న ఇందిరా పార్కు వద్ద ధర్నా: రాంచందర్రావు
హైదరాబాద్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన హిల్ట్(హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్)పాలసీని తక్షణం నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీజేపీ కోరింది. ఇందుకు సంబంధించి జారీ చేసిన జీవో 27ను సస్పెండ్ చేసేలా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ అంశంపై రిటైర్డు హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో సమగ్ర విచారణకు ఆదేశించాలని అభ్యర్థించింది. రూ.కోట్ల విలువైన పారిశ్రామిక భూములను కొంత మంది అఽధికార పార్టీ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అతి తక్కువ ధరకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు నేతృత్వంలో పార్టీ ప్రతినిధి బృందం సోమవారం రాజ్భవన్లో గవర్నర్ను కలిసి వినతిపత్రం సమర్పించింది. అనంతరం రాంచందర్రావు మీడియాతో మాట్లాడారు. ‘‘హిల్ట్ పాలసీని బీజేపీ వ్యతిరేకిస్తోంది. రైతులు, కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ప్రభుత్వం ఈ పాలసీని తీసుకువచ్చింది. రూ.వేల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను సబ్ రిజిస్ట్రార్ ధరలో మూడో వంతు ధరకే రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు, తమ భూములను కూడా మల్టీపర్ప్సగా మార్చాలని రైతులు ఎన్నో ఏళ్ల నుంచి కోరుతున్నా.. వారి అభ్యర్థనలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. హెచ్ఎండీఏ ఇటీవల నిర్వహించిన వేలంలో కోకాపేటలో ఎకరా రూ.151కోట్లు పలికింది. పారిశ్రామిక ప్రాంతాల్లో ప్రస్తుత మార్కెట్ ధర ఎకరా కనీసం రూ.65 కోట్లు ఉంటుంది. ఈ లెక్కన ప్రభుత్వం 9,292 ఎకరాలను విక్రయించడం ద్వారా రూ.6 లక్షల కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. ఈ మొత్తంతో ప్రభుత్వ రుణాలు మొత్తం చెల్లించవచ్చు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ధరలో 30 శాతం తక్కువకు ఈ పరిశ్రమల భూములను రియల్టర్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ విషయాన్ని గవర్నర్కు వివరించాం. దీనిపై ప్రభుత్వంతో చర్చిస్తానని ఆయన హామీ ఇచ్చారు. హిల్ట్ పాలసీతో పాటు జీహెచ్ఎంసీ పరిధి విస్తరణపై ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 7న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తాం’’ అని రాంచందర్రావు పేర్కొన్నారు. హిల్ట్ పాలసీతో ఖజానాకు ఎలా నష్టం జరుగుతుందో గవర్నర్కు వివరించినట్లు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి తెలిపారు. జీవో 27ను తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురయ్య తదితరులు గవర్నర్ను కలిసిన వారిలో ఉన్నారు.