Share News

Ramchander Rao: దేవుళ్లను ఎందుకు అవమానిస్తున్నారు..?

ABN , Publish Date - Dec 03 , 2025 | 03:52 AM

హిందూ దేవుళ్లను ఎందుకు అవమానిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు.. సీఎం రేవంత్‌రెడ్డిని నిలదీశారు. హిందూ....

Ramchander Rao: దేవుళ్లను ఎందుకు అవమానిస్తున్నారు..?

  • అల్లా గురించి మాట్లాడే ధైర్యముందా..?

  • రేవంత్‌ వ్యాఖ్యలపై రాంచందర్‌రావు ఫైర్‌

  • నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపు

  • బీజేపీ చెప్పిందే నిజమవుతోంది: సంజయ్‌

  • రేవంత్‌కు ఓట్లతో బుద్ధి చెప్పాలి: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): హిందూ దేవుళ్లను ఎందుకు అవమానిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు.. సీఎం రేవంత్‌రెడ్డిని నిలదీశారు. హిందూ దేవుళ్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సీఎం.. ముస్లింలు ఆరాధించే అల్లా గురించి మాట్లాడగలరా..? అని సవాల్‌ చేశారు. గతంలో మాజీ సీఎం కేసీఆర్‌ కూడా హిందువులను కించపరిచేలా మాట్లాడారని.. రేవంత్‌ కూడా ఆయన బాటలోనే నడుస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘‘హనుమంతుడికి పెళ్లి కాలేదన్న సంగతిని ఈ సమయంలో రేవంత్‌ చెప్పాలా..? ప్రజలకు తెలియదా..? మజ్లి్‌సతో సహవాసం తర్వాత రేవంత్‌ ఇస్లాంలోకి మారినట్లు అనిపిస్తోంది. రేవంత్‌లో హిందూ వ్యతిరేక లక్షణాలు కనిపిస్తున్నాయి’’ అని రాంచందర్‌రావు అన్నారు. హిందూ దేవుళ్లను అవమానపరిచేలా మాట్లాడిన రేవంత్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని రాంచందర్‌రావు.. పార్టీ శ్రేణులకు సూచించారు. ఉదయం 11.30 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించనున్నారు.

కాంగ్రెస్‌ ద్వేషం బట్టబయలైంది: సంజయ్‌

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీ చెప్పిందే నిజమవుతోందని, హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్‌ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ తెలిపారు. ‘‘కాంగ్రెస్‌ ముమ్మాటికీ మజ్లి్‌సకు కొమ్ము కాసే పార్టీ. ముస్లిం అంటేనే కాంగ్రెస్‌.. కాంగ్రెస్‌ అంటేనే ముస్లిం పార్టీ అని రేవంత్‌ చెప్పడమే ఇందుకు నిదర్శనం. జూబ్ల్లీహిల్స్‌ ఉప ఎన్నికలో పొరపాటున కాంగ్రెస్‌ లేదా బీఆర్‌ఎస్‌ గెలిస్తే హిందువులు బయట తలెత్తుకుని తిరగలేని ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించాం. సీఎం వ్యాఖ్యలను చూశాక ఇదే నిజమని తేలిపోయింది. హిందువుల పట్ల, హిందూ దేవుళ్ల పట్ల కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న ద్వేషం బట్టబయలైంది’’ అని సంజయ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, రేవంత్‌రెడ్డి.. హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్‌ డిమాండ్‌ చేశారు.

దేవతలను హేళన చేస్తారా..?: కిషన్‌రెడ్డి

హిందూ దేవీ దేవతలను అవహేళన చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడిన అహంకారపూరిత మాటలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఏ ఓట్లతో అధికార పీఠమెక్కి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారో, ఆ ఓట్లతోనే రేవంత్‌, కాంగ్రె్‌సకు పట్టిన మైకాన్ని, అహంకారాన్ని వదిలించాలని పిలుపునిచ్చారు. బహుశా ఎంఐఎం సహవాస దోషం వల్లే రేవంత్‌ హిందువులు, దేవీ దేవతల మీద బరితెగించి మాట్లాడుతున్నట్లున్నారని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

రాజ్‌భవన్‌ పేరు లోక్‌భవన్‌గా మార్పు..

తెలంగాణ రాజ్‌భవన్‌ పేరు మంగళవారం నుంచి లోక్‌భవన్‌గా మారింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం మంగళవారం జారీ చేసింది.

Updated Date - Dec 03 , 2025 | 03:52 AM