BJP Telangana president N. Rachandar Rao: కృష్ణా జలాల్లో 299 టీఎంసీలకే ఎందుకు సంతకం చేశారు?
ABN , Publish Date - Dec 24 , 2025 | 05:44 AM
తెలంగాణ రైతుల ప్రయోజనాలపై మీకు చిత్తశుద్ధి ఉంటే కృష్ణా జలాల్లో 299 టీఎంసీల వాటాకే అంగీకరిస్తూ ఎందుకు సంతకం చేశార...
ఇదేనా తెలంగాణ రైతులపై మీ చిత్తశుద్ధి?
కేసీఆర్కు రాంచందర్రావు సూటిప్రశ్న
ఓటములతో కేసీఆర్ మళ్లీ సెంటిమెంట్ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శ
హైదరాబాద్, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): ‘తెలంగాణ రైతుల ప్రయోజనాలపై మీకు చిత్తశుద్ధి ఉంటే కృష్ణా జలాల్లో 299 టీఎంసీల వాటాకే అంగీకరిస్తూ ఎందుకు సంతకం చేశార’ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు.. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్.. నీటిని, తెలంగాణ సెంటిమెంట్ను రాజకీయ ఆయుధంగా వాడుకున్నారని విమర్శించారు. ఓడిపోయి ఇప్పుడు మళ్లీ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్రావు మీడియాతో మాట్లాడారు. ‘పాలమూరు-రంగారెడ్డి వంటి ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ సెంటిమెంట్ ముగిసిపోతుందని, అందుకే ఆ ప్రాజెక్టును సెంటిమెంట్ ట్రంప్ కార్డులా పెండింగ్లో ఉంచుతామని బీఆర్ఎస్ నాయకులు గతంలో ఒక సమావేశంలో స్పష్టం చేశారు. ఆ సమావేశానికి ఎమ్మెల్సీ హోదాలో నేను హాజరయ్యాన’ని చెప్పారు. బచావత్, బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునళ్లలో కేసీఆర్ ప్రభుత్వం సమర్థంగా వాదించకపోవడం, బీఆర్ఎస్ విధానాల వల్లే తెలంగాణకు నష్టం జరిగిందని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ, బలం చూసి కేసీఆర్ బయటకొచ్చారన్నారు. కృష్ణా జలాలు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో బీజేపీపై, కేంద్రంపై కేసీఆర్ తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. మరో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభావంతో కేంద్రం ఈ ప్రాజెక్టు డీపీఆర్ను తిరస్కరించిందన్న కేసీఆర్ ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు. ‘వాస్తవాలు ప్రజల ముందు ఉంచకుండా సెంటిమెంట్ రాజకీయం చేయడమే కేసీఆర్ ధ్యేయం. కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా తెలంగాణకు అన్యాయం చేయలేదు.. చేయదు. కొన్ని నెలల తర్వాత కేసీఆర్ బయటకొచ్చి చేస్తున్న ఓటీపీ (వన్ టైం పాలిటిక్స్) ఇక నడవబోవు. రాష్ట్ర ప్రజల నోట్లో కేసీఆర్ మన్నుకొట్టారు.. అందుకే ఆయనకు వీఆర్ఎస్ ఇచ్చార’ని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎ్సలు నీటి సెంటిమెంట్తో రాజకీయాలు చేయడం తప్ప, రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయలేదని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ కాంట్రాక్టులు, కమీషన్ల కోసమే ప్రాజెక్టులు చేపట్టాయి తప్ప రైతుల కోసం కాదన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మోదీ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై బీజేపీ ప్రత్యేక అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఏ ప్రాజెక్టుకు నష్టం జరిగింది, ఎక్కడెక్కడ లోపాలున్నాయి, ఏ చర్యలు తీసుకోవాలన్న అంశాలపై ఈ బృందం అధ్యయనం చేస్తుందని వివరించారు.