Share News

Highway Accident: బారికేడ్లను ఢీకొన్న బైకు.. ఇద్దరి మృతి

ABN , Publish Date - Sep 09 , 2025 | 04:01 AM

అతివేగానికి ఇద్దరు యువకులు బలయ్యారు. బైక్‌తో బారికేడ్లను బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు..

Highway Accident: బారికేడ్లను ఢీకొన్న బైకు.. ఇద్దరి మృతి

  • హైదరాబాద్‌-బెంగళూర్‌ జాతీయ రహదారిపై ఘటన

శంషాబాద్‌ రూరల్‌, సెప్టెంబర్‌ 8 (ఆంధ్రజ్యోతి): అతివేగానికి ఇద్దరు యువకులు బలయ్యారు. బైక్‌తో బారికేడ్లను బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని హైదరాబాద్‌ - బెంగళూర్‌ జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి జరిగింది. గండిగూడకు చెందిన కట్ట చింటు (23), మదన్‌పల్లికి చెందిన మంచర్ల అఖిల్‌ (22) స్నేహితులు. ఆదివారం వారిద్దరు బైకుపై వెళ్తుండగా పెద్దషాపూర్‌ పాత చెక్‌పోస్టు వద్ద బైకు అదుపు తప్పి బారికేడ్లను ఢీకొట్టింది. దీంతో ఇద్దరి తలలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. పెద్దషాపూర్‌ చెక్‌పోస్టు వద్ద రహదారి విస్తరణ పనులు జరుగుతుండడంతో అక్కడ సిమెంట్‌ బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాటిని బలంగా ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు. మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చింటు ఓ ప్రైవేటు కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తుండగా, అఖిల్‌ ఎయిర్‌పోర్టు క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. చేతికొచ్చిన పిల్లలు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో వారి కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. అయితే రోడ్డుపై ఎలాంటి హెచ్చరికల బోర్డులు లేకుండా బారికేడ్లను ఏర్పాటు చేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని వారు ఆరోపించారు. బాధ్యుడైన రోడ్డు విస్తరణ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కేసు నమోదు చేసినట్లు సీఐ నరేందర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Sep 09 , 2025 | 04:01 AM