రాష్ట్రపతి చొరవతో బెంగాల్ వాసికి విముక్తి
ABN , Publish Date - Jun 15 , 2025 | 05:46 AM
రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక డెయిరీ ఫామ్ యజమాని బెంగాల్ వాసితో బలవంతంగా పని చేయించుకుంటున్న ఘటన వెలుగు చూసింది.
సొంతూరికెళ్లనున్న కోప్నా ముర్ము
ఆమనగల్లు, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక డెయిరీ ఫామ్ యజమాని బెంగాల్ వాసితో బలవంతంగా పని చేయించుకుంటున్న ఘటన వెలుగు చూసింది. మాడ్గుల మండలం జయరామ్ తండా (దుబ్బ తండా) వాసి నిర్వహిస్తున్న డెయిరీ ఫామ్లో నాలుగేళ్లుగా పశ్చిమ బెంగాల్ వాసి కోప్నా ముర్ము పనిచేస్తున్నాడు. అతడికి సంజయ్ నాయక్ భోజనంతోపాటు వసతి కల్పించాడు. కొంతకాలంగా అతడు కనిపించడం లేదని, హైదరాబాద్కు వెళ్లినట్లు తెలిసిందని ముర్ము కుటుంబ సభ్యులు రాష్ట్రపతి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించాలన్న రాష్ట్రపతి కార్యాలయం ఆదేశాల మేర కు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి విచారించగా సదరు వ్యక్తి.. మాడ్గుల సమీపంలో పనిచేస్తున్న ట్లు తేలింది.
కలెక్టర్ ఆదేశాలతో అక్కడికి వెళ్లిన కార్మిక, రెవెన్యూ శాఖల, పోలీసు అధికారులు కోప్నా ముర్ము ను మాడ్గుల పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి ఆయన వీడి యో స్టేట్మెంట్ రికార్డు చేసి, వివరాలు సేకరించారు. తానెవ్వరికి ఫిర్యాదు చేయలేదని, తనకు రావాల్సిన రూ.5,000 ఇస్తే, సొంతూరికి వెళ్లిపోతానని అధికారుల విచారణలో ముర్ము చెప్పాడు. అధికారుల ఆదేశాల మేరకు ముర్ముకు సంజయ్ నాయక్ రూ.5,000 ఇచ్చి, రైలులో సొంతూరు పంపేందుకు ఏర్పాట్లు చేశాడని మాడ్గుల ఎమ్మార్వో వినయ్ సాగర్, సీఐ వేణుగోపాల్ తెలిపారు. శనివారం రాత్రి ముర్ము సికింద్రాబాద్ నుంచి సొంతూరుకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు.