kumaram bheem asifabad- చెరువుల్లోకి చేప పిల్లలు
ABN , Publish Date - Aug 26 , 2025 | 10:41 PM
జిల్లాలోని చెరువుల్లో చేపపిల్లలు వదిలేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. మత్స్యకారు లకు ఉచిత చేప పిల్లల పంపిణీపై నెలకొన్న అనుమానాలకు తెరపడింది. ఈ ఏడాదిలో చేపపిల్లల పంపిణీ నిమిత్తం అవసరమైన టెండర్ ప్రక్రియ కొద్ది రోజుల క్రితం ప్రారంభమైంది. మొత్తంగా ఈ ఏడాది చేపపిల్లల పంపిణీ ఉంటుందా, ఉండదా అన్న అనుమానాలకు తెరపడింది
- టెండర్ల ప్రకియ ప్రారంభం
- జిల్లాలో 2,950 మంది మత్స్యకారులు
-ఆసిఫాబాద్రూరల్, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని చెరువుల్లో చేపపిల్లలు వదిలేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. మత్స్యకారు లకు ఉచిత చేప పిల్లల పంపిణీపై నెలకొన్న అనుమానాలకు తెరపడింది. ఈ ఏడాదిలో చేపపిల్లల పంపిణీ నిమిత్తం అవసరమైన టెండర్ ప్రక్రియ కొద్ది రోజుల క్రితం ప్రారంభమైంది. మొత్తంగా ఈ ఏడాది చేపపిల్లల పంపిణీ ఉంటుందా, ఉండదా అన్న అనుమానాలకు తెరపడింది. ఈ నెలాఖరు నాటికి టెండర్ ప్రక్రియ ముగిసి, సెప్టెంబరు రెండో వారంలో ప్రాజెక్టులు, చెరువులలో చేపల సీడ్ను వదిలేలా మత్స్యశాఖ అదికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులలోకి 1.44 కోట్ల వరకు సీడ్ను వదలనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
- జిల్లాలో 74 మత్స్యకార సంఘాలు..
జిల్లాలో 74 మత్స్య పారిశ్రామిక సహకార సం ఘాలు ఉండగా, ఇందులో 2,950 మంది మత్స్యకా రులున్నారు. ఈ కుటుంబాలకు చేపలు, రొయ్యల పెంపకం, విక్రయించడమే జీవనాధారం. జిల్లాలో 261 చెరువులు, 4 ప్రాజెక్టులు, 11 పెద్ద చెరువులు ఉన్నాయి. వీటిలో ఏటా మత్స్యశాఖ అందించే చేపల, రొయ్యల సీడ్ను వదిలి పెంచుతున్నారు. ఇదిలా ఉండగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018-2019లో తీసుకువచ్చిన సమీకృత మత్స్య అభివృద్ది పథకంతో మత్స్యకారులకు రూ. 2 కోట్లు విలువ చేసే ద్విచక్రవా హనాలు, ఆటోలు, ఫోర్ వీలర్లు, ట్రేలు, ఐస్బాక్స్లు, వలలు, ఎలక్ర్టానిక్ కాంటాలు అందించారు.
- ఈ ఏడాది ఆలస్యం..
ఈ ఏడాది చెరువులో చేపల విడుదల ఆలస్య మైంది. సాధారణంగా జూలైలో టెండర్లు ఆహ్వా నించి ఆగస్టులో చేపపిల్లలను వదులుతారు. కానీ ఈ ఏడాది ప్రభుత్వం సకాలంలో బడ్జెట్ కేటా యింపు జరుగక పోవడం వల్ల ఆలస్యమైంది. ఈనెల 20 న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. 35ఎంఎం నుంచి 40 ఎంఎం సీడ్కు రూ. 62 పైసలు, 80ఎంఎం నుంచి 100 ఎంఎం సీడ్ రూ. 1.65 పైసలు రేటుగా నిర్ణయిం చి టెండర్లు ఆహ్వానించారు. సెప్టెంబరు 1న టెండర్లు ఒపెన్ చేసి కాంట్రాక్టర్ను ఖరారు చేయనున్నారు. ఆ తర్వాత సెప్టెంబరు రెండో వారంలో సీడ్ను వదిలేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
టెండర్ ప్రక్రియ ప్రారంభం..
- సాంబశివరావు, జిల్లా మత్స్యశాఖ అదికారి
ఈ ఏడాది చేపల సీడ్ వదిలేందుకు అవసరమైన టెండర్ ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబరు 1 నాటికి టెండర్ ఓపెన్ చేస్తారు. జిల్లాలో సెప్టెంబరు రెండో వారంలో చేపల సీడ్ను వదిలేలా అన్ని ఏర్పా ట్లు చేస్తున్నాం. జిల్లాలోని ఆయా చెరువులు, ప్రాజెక్టు లలో ఈ ఏడాది 1.44 కోట్ల చేప పిల్లలు వదిలేందుకు నిర్ణయించాం.