Share News

సమస్యలపై అధికారులు అధ్యయనం చేయాలి

ABN , Publish Date - Jul 04 , 2025 | 12:23 AM

సమస్యలపై అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.

సమస్యలపై అధికారులు అధ్యయనం చేయాలి
నార్కట్‌పల్లిలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వేముల వీరేశం

నార్కట్‌పల్లి, జూలై 3(ఆంధ్రజ్యోతి): సమస్యలపై అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గురువారం ఎంపీడీవో కార్యాలయంలో వివిధ శాఖలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చేలా పనితీరు ఉండొద్దని సూచించారు. శాఖల వారీగా సమీక్ష చేసిన ఎమ్మెల్యే కొన్ని సమస్యలకు వెంటనే పరిష్కారం చూపారు. ఉదయ సముద్రం జలాశయం ప్రధాన కుడి కాల్వకు సంబంధించి జాతీయ రహదారిపై కల్వర్టు నిర్మాణ పనులకు జాతీయ రహదారి విభాగం నుంచి అనుమతి ఇప్పించాలని కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. బీ.వెల్లెంల ఉదయ సముద్రం జలాశయం నుంచి చెరువులకు నీటిని విడుదల చేయడంపై ఎమ్మెల్యే సంతృప్తి వ్యక్తంచేశారు. నార్కట్‌పల్లి రోడ్డు విస్తరణ పనులు నెలలుగా నిలిచిపో వడంపై అసహనం వ్యక్తం చేశారు. నోటీసులు ఇచ్చినా కాంట్రాక్టర్‌ స్పందించడం లేదని ఏఈ చెప్పడంతో వెంటనే ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈకి ఫోన్‌ చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసు కోవాలన్నారు. సమావేశంలో డీసీసీబీ వైస్‌ ఛైర్మన్‌ ఏసిరెడ్డి దయాకర్‌రెడ్డి, మార్కెట్‌ వైస్‌ ఛైర్మన్‌ ఐతరాజు యాదయ్య, ఎంపీడీవో ఉమేశ్‌చారి, తహసీల్దార్‌ వెంకటేశ్వర్‌ రావు, సీఐ నాగరాజు, కాంగ్రెస్‌ నాయకులు బండ సాగర్‌రెడ్డి, దూదిమెట్ల సత్తయ్య, సట్టు సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. నార్కట్‌పల్లి రోడ్డు విస్తరణ పనులు పూర్తిచేయాలని బీజేపీ నాయకులు మేడబోయిన శ్రీనివాస్‌, వడ్డేగోని రామలింగం, నోముల నాగరాజు తదితరులు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.

చిట్యాలరూరల్‌: గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో గురువారం అధికా రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో నీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని, విద్యుత్‌ సమస్యల పట్ల అధికారులు సిబ్బంది సమస్యను త్వరితగతిగా పరిష్క రించేందుకు ప్రయత్నించాలన్నారు. మండలంలో 394ఇందిరమ్మ ఇళ్లు మం జూర య్యాయని, త్వరలో శంకుస్థాప చేస్తామన్నారు. గంజాయి, మత్తుపదార్థాలు విని యోగించకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు. గ్రామాల్లో తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీసీసీబీ వైస్‌చైర్మన్‌ ఏసిరెడ్డి దయాకర్‌రెడ్డి, వెలిమినేడు పీఏసీఎస్‌ చైర్మన్‌ ఏనుగు రఘుమారెడ్డి, తహసీల్దార్‌ కృష్ణ, ఎంపీడీవో జయలక్ష్మి, సీఐ కె. నాగరాజు, ఎస్‌ఐ ఎం. రవికుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2025 | 12:23 AM