Share News

kumaram bheem asifabad- పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి

ABN , Publish Date - Oct 08 , 2025 | 10:17 PM

జిల్లాలో పత్తి కొనుగోలు ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో బుధవారం అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి సీసీఐ, మార్కెటింగ్‌, అగ్నిమాపక శాఖల అధికారులు, జిన్నింగ్‌ మిల్లుల యజమానులతో పత్తి కొనుగోలు ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

kumaram bheem asifabad- పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పత్తి కొనుగోలు ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో బుధవారం అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి సీసీఐ, మార్కెటింగ్‌, అగ్నిమాపక శాఖల అధికారులు, జిన్నింగ్‌ మిల్లుల యజమానులతో పత్తి కొనుగోలు ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఈ వానాకాలంలో రైతులు 3.34 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారని అన్నారు. 38 లక్షల క్వింటాళ్ల పత్తి పంట దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం పత్తి పంటకు రూ.8110 మద్దతు ధరను ప్రకటించిందని తెలిపారు. రైతులు కిసాన్‌ కపాస్‌ యాప్‌ ద్వారా పత్తి పంటను విక్రయించుకునేందుకు స్లాట్‌ బుకింగ్‌పై అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలో నవంబరు మొదటి వారంలో పత్తి కొనుగోలు ప్రారంభించాలని చెప్పారు. జిన్నింగ్‌ మిల్లులో ఏమైన మరమ్మతులు ఉన్నట్లయితే సమయంలోగా పూర్తి చేసుకుని కొనుగోలుకు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. విద్యుత్‌ శాఖ అదికారులు నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని అన్నారు. జిన్నింగ్‌ మిల్లుల్లో ఎలాంటి అగ్ని ప్రమాదాలకు అవకాశం లేకుండా అగ్నిమాపక శాఖ తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. తూనికలు, కొలతల శాఖ అధికారులు జిన్నింగ్‌ మిల్లులో ఎలాకా్ట్రనిక్‌ తూకాన్ని తనిఖీ చేయాలని ఆదేశించారు. పత్తి నిలువలు పేరుకు పోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిన్నింగ్‌ మిల్లులో రైతులకు అవసరమైన తాగునీరు, నీడ కల్పించాలని అన్నారు. జిల్లాలో 24 జిన్నింగ్‌ మిల్లుల ద్వారా పత్తి కొనుగోలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు దళారులకు విక్రయించకుండా సీసీఐ కేంద్రాలలో విక్రయించి కనీస మద్దతు ధర పొందాలని సూచించారు. సమావేశంలో మార్కెటింగ్‌ శాఖాధికరి అశ్వక్‌ అహ్మద్‌, జిల్లా వ్యవసాయాధికారి వెంకటి, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ శేషరావు, జిల్లా రవాణా శాఖాధికారి రాంచందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 08 , 2025 | 10:17 PM