kumaram bheem asifabad- దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
ABN , Publish Date - Dec 29 , 2025 | 11:20 PM
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్లు అన్నారు. కలెక్టరేట్లో సోమవారం అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సిర్పూర్(టి) మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలోని సర్వే నంబరు 47లో గల 14.08 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు అక్రమ పట్టా చేశారని దానిని రద్దు చేయాలని గ్రామానికి చెందిన మల్లయ్య, ఊశాలు వినతి పత్రం సమర్పించారు.
ఆసిఫాబాద్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్లు అన్నారు. కలెక్టరేట్లో సోమవారం అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సిర్పూర్(టి) మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలోని సర్వే నంబరు 47లో గల 14.08 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు అక్రమ పట్టా చేశారని దానిని రద్దు చేయాలని గ్రామానికి చెందిన మల్లయ్య, ఊశాలు వినతి పత్రం సమర్పించారు. జిల్లా కేంద్రంలోని దశ్నాపూర్కు చెందిన పొన్న సునీత తనకు వితంతు పింఛన్ ఇప్పించాలని, రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందిన జాదవ్ రోహిదాస్ తమ గ్రామంలో ప్రతిపాదిత ఓపెన్కాస్టు నిర్వాసితుల జాబితాలో తన పేరు లేనందున విచారణ జరిపించి న్యాయం చేయాలని దరఖాస్తులు అందజేశారు. రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన దుర్గం లక్ష్మి తాను సాగు చేస్తున్న ప్రభుత్వ భూమిని పట్టా చేసి తనకు పాసుపుస్తకం మంజూరు చేయాలని, జిల్లా కేంద్రంలోని జన్కాపూర్కు చెందిన పడాల తిరుపతి తన ఇళ్లు భారీ వర్షాలకు కూలీ పోయినందున నష్టపరిహరం మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. కౌటాల మండలం సాండ్గాం గ్రామానికి చెందిన రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని కొనుగొలు చేయాలని దరఖాస్తు చేశారు. కెరమెరి మండలం ఝరి గ్రామానికి చెందిన షేక్ దస్తగిరి తాను కొనుగొలు చేసిన భూమిని సాదాబైనామ ప్రకారం పట్టా మార్పిడి చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేసి చర్యలు తీసుకోవాలని కోరారు.