Ramchander Rao: ఆల్మట్టి ఎత్తు పెంచితే దక్షిణ తెలంగాణ ఎడారే
ABN , Publish Date - Sep 24 , 2025 | 03:29 AM
కర్ణాటక ప్రభు త్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచాలని నిర్ణయించడం వల్ల దక్షిణ తెలంగాణ రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని బీజేపీ...
రాష్ట్ర ప్రయోజనాల కోసం రేవంత్ చొరవ చూపాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు
హైదరాబాద్/చిక్కడపల్లి, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక ప్రభు త్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచాలని నిర్ణయించడం వల్ల దక్షిణ తెలంగాణ రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. ఆల్మట్టి డ్యాం పనులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చినప్పటికీ కర్ణాటక ప్రభుత్వం భూ సేకరణ చేపట్టడమంటే డ్యామ్ ఎత్తును పెంచే ప్రయత్నమే అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం రేవంత్ చొరవ తీసుకుని కర్ణాటక ప్రభుత్వంతో చర్చించాలని డిమాండ్ చేశారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాంచందర్రావు మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నా కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను రక్షించడానికి, రైతులకు అన్యాయం జరకుండా చూడటానికి ఎందుకు చొరవ చూపడం లేదని రేవంత్ను ప్రశ్నించారు.
నిరుద్యోగులకు అండగా ఉంటాం..
నిరుద్యోగులు అధైర్యపడొద్దని, వారికి బీజేపీ అండగా ఉంటుందని రాంచందర్రావు భరోసా ఇచ్చారు. మంగళవారం ఉదయం చిక్కడపల్లిలోని సెంట్రల్ లైబ్రరీకి వచ్చిన ఆయన నిరుద్యోగులతో మాట్లాడారు. నిరుద్యోగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ ఉద్యోగ నియామకాల కోసం ఆమరణ దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.