Bhukya Yakub: వ్యవసాయ కూలీ.. ఎక్సైజ్ ఎస్సైగా..
ABN , Publish Date - Sep 29 , 2025 | 03:52 AM
సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించి.. వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ చదువుకున్న యువకుడు ఎక్సైజ్ ఎస్సై పోస్టు కొట్టాడు...
కొత్తగూడ, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించి.. వ్యవసాయ కూలీ పనులకు వెళ్తూ చదువుకున్న యువకుడు ఎక్సైజ్ ఎస్సై పోస్టు కొట్టాడు. ఆ యువకుడి పేరు.. భూక్య యాకూబ్. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పోలారం గ్రామానికి చెందిన భూక్య భిక్షం, భిచ్చని దంపతులు వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు యాకూబ్, శ్రీనివాస్, కూతురు గౌషా ఉన్నారు. కష్టపడి పీజీ దాకా చదువుకున్న యాకూబ్.. తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేందుకు వ్యవసాయకూలీగా వెళ్తుండేవారు. ఎటువంటి కోచింగ్ తీసుకోకుండానే.. హైదరాబాద్ చిక్కడపల్లిలోని సెంట్రల్ లైబ్రరీలో చదువుకుని గ్రూప్-2లో ఎస్టీ కేటగిరీలో 27వ ర్యాంకు, ఓపెన్ కేటగిరీలో 752వ ర్యాంకు సాధించి ఎక్సైజ్ ఎస్సైగా ఉద్యోగం సాధించారు. గ్రూప్-3లో సైతం ఎస్టీ కేటగిరీలో 8వ ర్యాంకు, ఓపెన్ కేటగిరీలో 644 ర్యాంకు సాధించారు.