kumaram bheem asifabad-చలి గుప్పిట్లో ఏజెన్సీ గ్రామాలు
ABN , Publish Date - Dec 22 , 2025 | 11:29 PM
కుమరం భీం ఆసిఫాబాద్ ఏజెన్సీ చలి గుప్పిట్లో చిక్కి గజగజ వణుకుతోంది. రెండు మూడేళ్లలో ఎప్పుడు లేనంతగా ఈ ఏడాది ఒక్క సారిగా వాతావరణం మారిపోవడంతో ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు చలితో అవస్థలు పడిపోతున్నారు
- వృద్ధులు, చిన్న పిల్లల ఆరోగ్యంపైనే తీవ్ర ప్రభావం
ఆసిఫాబాద్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్ ఏజెన్సీ చలి గుప్పిట్లో చిక్కి గజగజ వణుకుతోంది. రెండు మూడేళ్లలో ఎప్పుడు లేనంతగా ఈ ఏడాది ఒక్క సారిగా వాతావరణం మారిపోవడంతో ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు చలితో అవస్థలు పడిపోతున్నారు. ఉదయం తొమ్మిది గంటలైనా ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొని ఉంది. ముఖ్యంగా ఏజెన్సీ మండలాలైన సిర్పూర్ (యు), కెరమెరి, జైనూర్, లింగాపూర్, తిర్యాణి, వాంకిడి, ఆసిఫాబాద్ మండలాల్లో చలి తీవ్రత అత్యధికంగా ఉంది. పదిహేను రోజులుగా సిర్పూర్ (యు) మండలంలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 4.8 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు తిర్యాణి మండలం గిన్నెధరిలో అత్యల్పంగా 7.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆదివాసీలు రోజు వారి పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు. శీతల గాలుల తీవ్రత వల్ల జలుబు, దగ్గు వంటి సీజన్ వ్యాధులు కూడా ప్రబలుతున్నాయి. ఇటు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోనూ అత్యల్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఈ పరిస్థితి రాబోయే రోజుల్లో తీవ్రతరం కావచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు ప్రజలు నెగళ్లతో ఉపశమనం పొందుతున్నారు. మధ్యాహ్న 12 గంటల వరకు కూడా చలిగాలులు వీస్తుండడంతో. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలు కూడా మధ్యాహ్నం తరువాతే రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఫ మారుమూల గ్రామాల్లో పరిస్థితి..
జిల్లాలోని 15 మండలాల పరిధిలో ఉన్న మారుమూల గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. రైతులు, రైతు కూలీలు రోజు వారి పనులు చేసుకునేందుకు కూడా బయటకు రాలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఉదయం పొగ మంచు కూడా విపరీతం కురుస్తుడడంతో చర్మ సంబంధ వ్యాధుల బారిన పడి చికాకులు ఎదుర్కొంటున్నారు. ఉదయం వేళల్లో పనులకు వెళ్లె రైతులు, రైతు కూలీలకు గాలిలో తేమ కారణంగా శ్వాస సంబంధమైన వ్యాధులు కూడా ఎక్కువగానే నమోదు అవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా పత్తి తీసే సీజన్ కావడంతో రైతు కూలీలు పనులకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. సాధారణంగా కూలీలు వ్యవసాయ క్షేత్రాలకు ఉదయం తొమ్మిది గంటలకు వెళ్లి సాయంతం ఐదు గంటల వరకు పని చేస్తారు. ప్రస్తుత పరిస్థితులతో పది, పదిన్నర గంటలు దాటితే తప్ప కూలీలు చేలకు రాక పోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో దూర ప్రాంతాలకు వెళ్లేవారు సైతం చలిదెబ్బకు తమ ప్రయాణాలను పగటి వేళలకు మార్చుకుంటున్నారు. ఉదయం తొమ్మిది, పది గంటలు దాటితే తప్పా కూరగాయల మార్కెట్లలో జనం కనిపించడం లేదు. వాతావరణంలో మార్పుల కారణంగా వృద్దులు, చిన్న పిల్లల ఆరోగ్యంపైనే తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఫ వాతావరణ మార్పుల కారణంగా..
వాతావరణంలో మార్పుల కారణంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఇస్నోఫిలియా వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్యులు గుర్తించారు. చలితీవ్రత అధికంగా ఉన్న సమయంలో సరైన రక్షణ లేకుండా చలిగాలిలో తిరిగే వారిలోనే ఈ లక్షణాలు అధికంగా కనిపిస్తాయి. రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య పడిపోయి తెల్ల రక్త కణాలు పెరగడం వల్ల ఇస్నోఫిలియా ప్రభావం పెరుగుతుందని ఫలితంగా దీని భారిన పడిన బాధితులు దగ్గు, జల్బు వంటి అలర్జీలతో పాటు ఒంటిపై దురద, దద్దుర్లు రావడం వంటి సమస్యలకు గురవుతారు. ఏ మాత్రం అశ్రద్ద చేసినా రక్తంలో తేడా వల్ల వ్యాధి ముదిరి దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీసే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. చలి తీవ్రత పెరుగుతున్న కొద్ది 0-5 చిన్నారుల్లో శ్వాస సంబంధమైన సమస్యలు అధికంగా కనిపిస్తాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం అలస త్వం ప్రదర్శించినా ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తాయి. శ్వాసకోశ సంబంధమైన రుగ్మతలు సోకే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. జ్వరం లక్షణాలు కనిపించక పోయినా చిన్న పిల్లలకు దగ్గు, జలుబు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
జిల్లాలో ఎనిమిది రోజులుగా నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇలా..
డిసెంబరు 15 7.6
డిసెంబరు 16 7.9
డిసెంబరు 17 7.6
డిసెంబరు 18 5.7
డిసెంబరు 19 6.3
డిసెంబరు 20 4.8
డిసెంబరు 21 7.2
డిసెంబరు 22 7.0