Share News

Telangana Rising: నిన్నటిదాకా ఒక లెక్క.. నేటి నుంచి మరో లెక్క

ABN , Publish Date - Dec 08 , 2025 | 04:20 AM

భారత్‌ ఫ్యూచర్‌ సిటీ.. రేపటి తెలంగాణ ప్రగతికి వేగుచుక్క అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నిన్నటి వరకు ఒక లెక్క.. తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ తర్వాత మరో లెక్క అన్నట్లుగా రాష్ట్రంలో .........

Telangana Rising: నిన్నటిదాకా ఒక లెక్క.. నేటి నుంచి మరో లెక్క

  • భారత్‌ ఫ్యూచర్‌ సిటీ.. రేపటి తెలంగాణ ప్రగతికి వేగుచుక్క

  • ప్రజా పాలన విజయోత్సవ శుభాకాంక్షలు: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): భారత్‌ ఫ్యూచర్‌ సిటీ.. రేపటి తెలంగాణ ప్రగతికి వేగుచుక్క అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నిన్నటి వరకు ఒక లెక్క.. తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ తర్వాత మరో లెక్క అన్నట్లుగా రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెట్టబోతోందని తెలిపారు. తన గొంతులో ఊపిరి, రాష్ట్ర ప్రజల తోడు ఉన్నంతవరకు తెలంగాణ రైజింగ్‌కు తిరుగుండదని పేర్కొన్నారు. నిన్న, నేడు, రేపు.. తెలంగాణ ప్రజల ఆశీర్వాదమే తన ఆయుధమని, వారి ప్రేమాభిమానాలే తనకు సర్వం, సహకారమే సమస్తమని చెప్పారు. రాష్ట్రంలో ప్రజా పాలనకు రెండేళ్లు నిండిన సందర్భంగా ఆదివారం ‘ఎక్స్‌’ వేదికగా ప్రజలకు ముఖ్యమంత్రి విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సరిగ్గా రెండేళ్ల కిందట నాకు ఆ ధైర్యాన్నిచ్చి.. ఓటుతో గెలుపు సంకల్పాన్నిచ్చి.. నిండు మనసుతో ఆశీర్వదించిన తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను. ఈ రెండేళ్ల ప్రస్థానంలో అనునిత్యం అహర్నిశలూ అవనిపై తెలంగాణను శిఖరాగ్రాన నిలిపేందుకు తపనతో శ్రమించాను. గత పాలన శిథిలాల కింద కొన ఊపిరితో ఉన్న నవతరానికి కొలువుల జాతరతో కొత్త ఊపిరి పోశాం. రుణభారంతో వెన్ను విరిగిన రైతుకు దన్నుగా నిలిచి దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలిపాం. ఆడబిడ్డల ఆకాంక్షలకు ఆర్థిక మద్దతునిచ్చి అదానీ, అంబానీల లెక్క వ్యాపార రంగంలో నిలిపాం. బలహీన వర్గాల వందేళ్ల ఆకాంక్షలను కుల లెక్కలతో కొత్త మలుపులు తిప్పాం. వర్గీకరణతో మాదిగ సోదరుల ఉద్యమానికి నిజమైన సార్థకత చేకూర్చాం’’ అని సీఎం రేవంత్‌ వివరించారు.

దేశానికి గ్రోత్‌ ఇంజిన్‌గా తెలంగాణ..

చదువొక్కటే బతుకుదెరువుకు బ్రహ్మాస్త్రమని నమ్మి.. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ మోడల్‌ స్కూళ్ల నిర్మాణ యజ్ఞానికి పునాదులు వేశామని సీఎం తెలిపారు. స్కిల్‌ యూనివర్సిటీ, స్పోర్ట్స్‌ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టామని, ేస్వచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వం మూల సిద్ధాంతంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. ‘‘జయ జయహే తెలంగాణ అన్న ప్రజాకవి అందెశ్రీ గేయానికి.. జన ఆకాంక్షల మేరకు అధికారిక గుర్తింపు ఇచ్చాం. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఆడబిడ్డలకు ఉచిత బస్సు పథకం, రూ.500కే గ్యాస్‌, సన్న ధాన్యానికి రూ.500 బోనస్‌, కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే గొప్ప పథకాలన్నీ ఈ రెండేళ్ల సంక్షేమ చరిత్రకు సాక్ష్యాలు. ప్రస్తుత అవసరాలను తీర్చి, పేదలకు సంక్షేమాన్ని కూర్చి.. ఇదే అద్భుతమని మేం సరిపెట్టలేదు. స్వతంత్ర భారత ప్రయాణం వందేళ్ల మైలురాయికి చేరే సందర్భంలో 2047 నాటికి మన తెలంగాణ ఎట్లుండాలి, ఎక్కడ ఉండాలనే దానిపై లోతైన మథనంతో మార్గదర్శక పత్రం సిద్ధం చేశాం. గత పాలకులు కలలో కూడా ఊహించని విజన్‌కు మేం ప్రాణం పోశాం. ప్రపంచ వేదికపై తెలంగాణ రైజింగ్‌ రీసౌండ్‌ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. భారతదేశ గ్రోత్‌ ఇంజిన్‌గా తెలంగాణను మార్చడానికి సర్వం సిద్ధం చేశాం’’అని వివరించారు.

Updated Date - Dec 08 , 2025 | 04:20 AM