Aditya Vantage Construction: కోర్టు తీర్పుతోనే ఆదిత్య వాంటెజ్కు అనుమతుల పునరుద్ధరణ
ABN , Publish Date - Oct 01 , 2025 | 03:01 AM
హైకోర్టు తీర్పుతోనే రంగారెడ్డి జిల్లా మంచిరేవుల గ్రామంలో శ్రీ ఆదిత్య సంస్థ నిర్మిస్తున్న వాంటెజ్ భవన నిర్మాణానికి అనుమతులను పునరుద్ధరించామని హెచ్ఎండీ...
రంగారెడ్డి కలెక్టర్, ఇరిగేషన్ శాఖల ఎన్వోసీతో 2022లో నిర్మాణానికి అనుమతుల మంజూరు
మూసీని ఆక్రమించడంతో రద్దు: హెచ్ఎండీఏ
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు తీర్పుతోనే రంగారెడ్డి జిల్లా మంచిరేవుల గ్రామంలో శ్రీ ఆదిత్య సంస్థ నిర్మిస్తున్న వాంటెజ్ భవన నిర్మాణానికి అనుమతులను పునరుద్ధరించామని హెచ్ఎండీఏ మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ‘‘మంచిరేవులలోని సర్వే నంబరు 476/ఏఏ1, 476/ఏఏ2 లో 9.19 ఎకరాల విస్తీర్ణంలో 38 అంతస్తుల భవన నిర్మాణానికి అనుమతుల కోసం 2022 మే 12న హెచ్ఎండీఏకు దరఖాస్తు అందింది. ప్రతిపాదిత భూమికి సమీపంలో మూసీ ఉన్నట్లు హెచ్ఎండీఏ గుర్తించింది. అయితే, ఇరిగేషన్ శాఖ, రంగారెడ్డి కలెక్టర్ నుంచి అప్పటికే పొందిన ఎన్వోసీలను హెచ్ఎండీఏకు దరఖాస్తుదారు అందించారు. ఆదిత్య కంపెనీ ప్రతిపాదనలను మల్టీ స్టోరీ బిల్డింగ్(ఎంఎ్సబీ) కమిటీ సమావేశంలో చర్చించిన తర్వాత భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడానికి నిర్దేశిత ఫీజు చెల్లించాలని సంస్థకు సూచించారు. ఫీజు చెల్లించిన తర్వాత 2022 ఆగస్టు 19న భవన నిర్మాణ అనుమతులను జారీచేశారు. మూసీ బఫర్ జోన్ను ఆక్రమించి రిటైనింగ్ వాల్ను నిర్మించినట్లు 2023 జూలై 3న హెచ్ఎండీఏ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా చేపట్టిన తనిఖీలో తేలింది. దాంతో అదే ఏడాది ఆగస్టు 2న ఆదిత్య కంపెనీకి హెచ్ఎండీఏ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆ సంస్థ వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో 15రోజుల తర్వాత కంపెనీకి ఇచ్చిన భవన నిర్మాణ అనుమతులను హెచ్ఎండీఏ రద్దు చేసింది. రిటైనింగ్ వాల్ను తొలగించాలని సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ అనుమతులను రద్దుచేయడాన్ని సవాలు చేస్తూ ఆదిత్య కంపెనీ హైకోర్టుకు వెళ్లింది. మరోసారి తనిఖీలు చేపట్టి నివేదిక ఇవ్వాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. గతేడాది ఫిబ్రవరి 26న అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఆ సంస్థ రిటైనింగ్ వాల్ను తొలగించినట్లు నిర్ధారించారు. దీంతో అనుమతులను పునరుద్ధరించాలని గతేడాది మార్చి 1న హైకోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పును అమలు చేస్తూ గతేడాది జూన్ 20న అనుమతులను పునరుద్ధరిస్తూ హెచ్ఎండీఏ ఉత్తర్వులు జారీ చేసింది’’ అని హెచ్ఎండీఏ ఒక ప్రకటనలో వివరించింది.