Adilabad: కన్నీటి కష్టాలు
ABN , Publish Date - Apr 11 , 2025 | 05:35 AM
ఆదిలాబాద్ జిల్లా గిరిజన గ్రామాలు తాగునీటి కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. తలమడుగు మండలం రత్నాపూర్ గ్రామంలో 500 మందికి తాగునీరు అందుకోవడం కష్టమవుతోంది. బావులు ఎండిపోయి, గ్రామస్తులు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి నీటి కోసం పడిపోతున్నారు

Andhra Jyothy: ఆదిలాబాద్ జిల్లా గిరిజన గ్రామాల్లోని ఆదివాసీలు తాగునీటికి అల్లాడుతున్నారు. జిల్లాలోని తలమడుగు మండలం రత్నాపూర్ గ్రామస్థులు గుక్కెడు నీటి కోసం విలవిల్లాడుతున్నారు. 500మంది జనాభా గల ఈ గ్రామంలో వేసవి వచ్చిందంటే తాగునీటి కోసం పడే కష్టాలు అన్నీఇన్నీ కావు. గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో.. ఉన్న ఒక్క బావి పూర్తిస్థాయిలో ఎండిపోయింది. దీంతో తెల్లవారుజాము 4గంటలకే తమ పిల్లాపాపలతో జనం వ్యవసాయ బావుల వద్దకు నీటి కోసం పరుగులు తీస్తున్నారు. నెత్తిన బిందెలతో కాలినడకన వ్యవసాయ బావుల వద్దకు వెళుతూ పానీపట్టు యుద్ధం చేస్తున్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఎన్నిసార్లు విన్నవించినా.. ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
-ఆంధ్రజ్యోతి,తలమడుగు