Akkineni Nagarjuna: మా కుటుంబంలోనూ ఒక రు డిజిటల్ అరెస్టు
ABN , Publish Date - Nov 18 , 2025 | 05:13 AM
దేశ ప్రజలకు కునుకు లేకుండా చేస్తున్న సైబర్ మోసాల సెగ తన ఇంటికి కూడా తాకిందని టాలీవుడ్ హీరో నాగార్జున తెలిపారు....
రెండ్రోజులు నిర్బంధించారు
సైబర్ మోసాల సెగ మా ఇంటికి కూడా తగిలింది
సినీ హీరో అక్కినేని నాగార్జున
హైదరాబాద్ సిటీ, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): దేశ ప్రజలకు కునుకు లేకుండా చేస్తున్న సైబర్ మోసాల సెగ తన ఇంటికి కూడా తాకిందని టాలీవుడ్ హీరో నాగార్జున తెలిపారు. తమ కుటుంబంలో ఒకరు డిజిటల్ అరెస్ట్ మోసం బారినపడ్డారని వెల్లడించారు. తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిని సైబర్ నేరగాళ్లు సుమారు రెండు రోజుల పాటు ఎటూ కదలకుండా ఇంట్లోనే ఉండేటట్లు నిర్బంధించారని చెప్పారు. సినిమా పైరసీ ముఠా అరెస్టు నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్తో పాటు మీడియాలో మాట్లాడిన నాగార్జున తన కుటుంబంపై జరిగిన సైబర్ నేరాన్ని వెల్లడించారు. ఐబొమ్మ రవి బృందం రూ.20 కోట్ల కోసం సినిమాల పైరసీ చేయడం లేదని, దీని వెనుక అంతర్జాతీయ ముఠా ఉందని చెప్పారు. 50 లక్షల మంది సబ్స్క్టైబర్ల డేటా వారికి చేరిందని, ఇందులో సైబర్ నేరాల ద్వారా వేల కోట్లు దోచేసే పెద్ద ప్లాన్ ఉంటుందని చెప్పారు. పైరసీని అరికట్టేందుకు తెలంగాణ పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమని నాగార్జున అన్నారు. ఐబొమ్మ నిర్వాహకుడి అరెస్ట్ వార్త తెలిసి చెన్నై నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేసి హైదరాబాద్ పోలీసులు మాటల మనుషులు కాదని, చేతల్లో చూపించారని ప్రశంసించాడని చెప్పారు.