భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Jul 18 , 2025 | 12:26 AM
తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నవారిపై చర్యలు తీసుకో వాలని బాధితులు గురువారం నల్లగొండ జిల్లా మిర్యాల గూడ సబ్కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.
మిర్యాలగూడ సబ్కలెక్టర్ కార్యాలయం ఎదుట పెట్రోల్ బాటిళ్లు, పురుగుల మందు డబ్బాలతో బాధితుల ఆందోళన
మిర్యాలగూడ, జూలై 17(ఆంధ్రజ్యోతి): తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నవారిపై చర్యలు తీసుకో వాలని బాధితులు గురువారం నల్లగొండ జిల్లా మిర్యాల గూడ సబ్కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. మొల్క చర్ల గ్రామానికి చెందిన దైద రమణ, దైద శ్రీను కుటుంబసభ్యులు ఉదయం 11 గంటలకు సబ్కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. తమకు న్యాయం చేసే వరకు కదిలేదిలేదని భీష్మించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ అడవిదేవులపల్లి మండలం మొల్క చర్ల గ్రామం సర్వే నెంబర్ లో తమ పేర పట్టాకలిగిన 153బై 151, 163, 163బై2 లోని మూడు ఎకరాల ఇనాం భూముల ను మాజీ సీఎం వైఎస్ హయాం నుంచి సాగు చేసుకుంటూ జీవి స్తున్నామని తెలిపారు. తమ భూమిలోకి అదే గ్రామానికి చెందిన పాతులోతు సుజాత, రాంకోటి రాత్రి సమయాల్లో యంత్రాలు, మంది మార్బలంతో వచ్చి చెట్లు నరికి, భూమి దున్ని కబ్జాకు యత్నిస్తున్నారని ఆరోపించారు. గతంలో అడవి దేవులపల్లి తహసీల్దార్కు, పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఆ భూమికి ఆనుకుని ఉన్న మా పేర పట్టాకలిగిన ఇనాం భూములను కబ్జా చేసేందుకు యత్నిస్తూ చంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు చర్యలు చేపట్టి తమ భూములకు, తమకు రక్షణ కల్పించాలని లేకుంటే పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడతామని భీష్మించారు. పూర్తిస్థాయి లో విచారణ జరిపి న్యాయం జరిగేలా చూస్తానని సబ్కలెక్టర్ నారాయణ అమిత్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.