నిందితుడికి రెండేళ్ల జైలు, జరిమానా
ABN , Publish Date - Jul 15 , 2025 | 12:41 AM
వివాహితను వేధించిన కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి రెండేళ్ల జైలుశిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తూ నిడమనూరు జూనియర్ సివిల్జడ్జి కోర్టు న్యాయమూర్తి టీ. స్వప్న తీర్పు వెల్లడించారు.
నిడమనూరు, జూలై 14(ఆంధ్రజ్యోతి): వివాహితను వేధించిన కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడికి రెండేళ్ల జైలుశిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తూ నిడమనూరు జూనియర్ సివిల్జడ్జి కోర్టు న్యాయమూర్తి టీ. స్వప్న తీర్పు వెల్లడించారు. కోర్టు లైజన్ అధికారి అలీ అహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం.. 2015 డిసెంబరు 18న నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామంలో పెదమాము అంజయ్య అర్థరాత్రి ఒంటి గంట సమయంలో ఓ మహిళ ఇంటికి వెళ్లి తలుపు కొట్టగా తన భర్త వచ్చాడని భావించిన ఆమె తలుపు తీసింది. ఆమె చెయ్యి పట్టుకుని లైంగికంగా వేధించాడు. దీంతో భయంతో ఆమె కేకలు వేసింది. ఇరుగు పొరుగు రావడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు మరోసటిరోజు పోలీ్సస్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పటి ఎస్ఐ నర్సింహరాజు నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. సోమవారం కేసు విచారించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితుడికి రెండేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.మూడు వేల జరిమానా విధించారు. ఒకవేళ జరిమానా చెల్లించనిపక్షంలో నిందితుడు అదనంగా నెల రోజుల జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో వెల్లడించారు. ప్రాసిక్యూషన్ తరపున పీపీ సాధన వాదనలు వినిపించగా, కోర్టు పీసీ నవీన్ కేసు విచారణకు సహకరించారని లైజన్ అధికారి తెలిపారు.