kumaram bheem asifabad- సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల జాబితాను అందజేయాలి
ABN , Publish Date - Nov 21 , 2025 | 10:05 PM
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల జాబితాను అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలోని వీసీ హాల్ నుంచి ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్రావు, డీపీవో భిక్షపతితో కలిసి శుక్రవారం జూమ్ మీటింగ్ ద్వారా తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సబ్ ఇన్స్పెక్టర్లతో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలలో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు
ఆసిఫాబాద్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల జాబితాను అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలోని వీసీ హాల్ నుంచి ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్రావు, డీపీవో భిక్షపతితో కలిసి శుక్రవారం జూమ్ మీటింగ్ ద్వారా తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సబ్ ఇన్స్పెక్టర్లతో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలలో తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై వీసీ ద్వారా ఆదేశాల జారీ చేశారని తెలిపారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లాలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహించనున్నామని తెలిపారు. గొడవలు జరిగిన పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల జాబితాను తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, సబ్ ఇన్స్పెక్టర్ సంతకాలతో అందించాలని తెలిపారు. ఆయా పోలింగ్ కేంద్రాలలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని, డెడికేషన్ కమిషన్ కేటాయించిన ప్రకారం సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టాలని అన్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నిబంధనల ప్రకారం ప్రక్రియ నిర్వహించాలని తెలిపారు. ఈ నెల 22వ తేదీలోగా ఓటరు జాబితాలోని అభ్యంతరాలు, పోలింగ్ కేంద్రాలపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించాలని సూచించారు. 23న తుది ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రకటించాలని తెలిపారు. పోలింగ నిర్వహణకు అవసరమైన పోలింగ్ సిబ్బంది, బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రి సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఎన్నికల కార్యాచరణ ఖరారు అయిన రోజు నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్ఠంగా అమలు చేయాలని తెలిపారు. సమాశంలో డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్, డీఎల్పీవో ఉమర్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.