Artificial Intelligence: ఏఐ టూల్స్తో ఏ లాభం లేదు!
ABN , Publish Date - Sep 02 , 2025 | 02:17 AM
ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఖర్చులు తగ్గించుకొని, లాభాలు పెంచుకోవడానికి కృత్రిమ మేధ (ఏఐ)ను వాడుకోవాలని చూస్తున్న ఈ తరుణంలో ఓ ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
8 95% కంపెనీలకు రాబడి సున్నా: ఎంఐటీ అధ్యయనం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 1: ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఖర్చులు తగ్గించుకొని, లాభాలు పెంచుకోవడానికి కృత్రిమ మేధ (ఏఐ)ను వాడుకోవాలని చూస్తున్న ఈ తరుణంలో ఓ ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఏఐ వ్యవస్థలను అమలు చేసిన 95 శాతం సంస్థలు పెట్టిన పెట్టుబడికి ఏ లాభాన్ని పొందలేకపోయాయని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) అధ్యయనంలో తేలింది. జెన్ ఏఐలో సుమారు 30-40 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన 95 శాతం సంస్థలు ఏ రాబడిని పొందలేదని వివరించింది. ‘ది జెన్ ఏఐ డివైడ్: స్టేట్ ఆఫ్ ఏఐ ఇన్ బిజినెస్-2025’ పేరుతో ఎంఐటీ అధ్యయన నివేదికను విడుదల చేసింది.
పరిశోధకులు 300 ఏఐ ప్రాజెక్టులపై సర్వే చేసి.. 350 మంది ఉద్యోగులతో నేరుగా మాట్లాడారు. చాట్ జీపీటీ, కోపైలట్ టూల్స్ను విస్తృతంగా వాడుతున్న కేవలం 5 శాతం సంస్థలు మాత్రమే వాస్తవంగా లాభాల్లో ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు. ఇక మిగతా సంస్థలు ఏ లాభం కానీ.. నష్టం కానీ లేకుండా నడుస్తున్నాయని తెలిపారు. ‘80 శాతం సంస్థలు ఏఐ సేవల కోసం ప్రయత్నించాయి. దాదాపు 40 శాతం సంస్థలు ఏఐ వ్యవస్థలను అమలు చేశాయి. అయితే ఈ ఏఐ సాధనాలు వ్యక్తిగత ఉత్పాదకతను పెంచాయే తప్ప లాభ నష్టాలపై ఏ ప్రభావం చూపకలేకపోయాయి. ఈ క్రమంలోనే చాలా సంస్థలు ఏఐ సేవలను నిశ్శబ్దంగా తిరస్కరిస్తున్నాయి’ అని వివరించారు.