Virat Kohli visited the Simhachalam temple: అప్పన్నను దర్శించుకున్న విరాట్ కోహ్లీ
ABN , Publish Date - Dec 08 , 2025 | 05:04 AM
సింహాచలంలోని వరాహ లక్ష్మీనృసింహస్వామిని భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్ దర్శించుకున్నారు....
సింహాచలం (ఆంధ్రజ్యోతి): సింహాచలంలోని వరాహ లక్ష్మీనృసింహస్వామిని భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్ దర్శించుకున్నారు. ఆదివారం సింహగిరికి చేరుకున్న వీరిద్దరికి దేవస్థానం ఏఈవో కె. తిరుమలేశ్వరరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కప్పస్తంభం ఆలింగనం తరువాత బేడా మండప ప్రదక్షిణలు చేసి అంతరాలయంలోకి ప్రవేశించిన క్రికెటర్ల గోత్రనామాలతో ప్రధానార్చకులు స్వామికి అష్టోత్తర శతనామార్చన చేశారు. గోదాదేవి సన్నిధిలో కర్పూర నీరాజనాలిచ్చిన తరువాత పండితులు చతుర్వేద స్వస్తి వచనాలతో ఆశీర్వచనాలీయగా, ఏఈఓ శాలువతో సత్కరించి స్వామివారి ఫొటోను, ప్రసాదాలను అందజేశారు. ఆలయ అధికారుల అభ్యర్థన మేరకు విజిటర్స్ బుక్లో కోహ్లీ సంతకం చేశారు. స్వామి అనుగ్రహంతో విజయం సాధించామని లిఖితపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.