Vaibhav Suryavanshi: వైభవ్ విధ్వంసం
ABN , Publish Date - Dec 13 , 2025 | 06:17 AM
ఏ విభాగం మ్యాచ్ అయినా.. వేదిక ఎక్కడైనా 14 ఏళ్ల చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి ఎదురులేకుండా పోతోంది. తాజాగా...
95 బంతుల్లో 171
యూఏఈపై 234 పరుగులతో భారత్ ఘన విజయం
అండర్-19 ఆసియాకప్
దుబాయ్: ఏ విభాగం మ్యాచ్ అయినా.. వేదిక ఎక్కడైనా 14 ఏళ్ల చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి ఎదురులేకుండా పోతోంది. తాజాగా అండర్-19 ఆసియాకప్ ఆరంభ మ్యాచ్లో తన బ్యాట్ పదునేంటో యూఏఈ బౌలర్లకు రుచి చూపించాడు. 95 బంతుల్లోనే 9 ఫోర్లు, 14 సిక్సర్లతో చెలరేగిన వైభవ్ 171 పరుగులతో అదుర్స్ అనిపించాడు. అతడి ధాటికి ప్రత్యర్థి యూఏఈ 234 పరుగుల భారీ తేడాతో చిత్తు కావడం గమనార్హం. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత కుర్రాళ్లు 50 ఓవర్లలో 6 వికెట్లకు 433 పరుగులతో బెంబేలెత్తించారు. అండర్-19 విభాగంలో భారత్కిదే అత్యధిక స్కోరు. ఈక్రమంలో 2004లో చేసిన 425 పరుగుల రికార్డు బ్రేక్ అయ్యింది. ఆరోన్ జార్జి (69), విహాన్ (69) అర్ధసెంచరీలతో రాణించారు. 55 బంతుల్లోనే శతకం బాదిన వైభవ్-జార్జి మధ్య రెండో వికెట్కు 212 పరుగులు జత చేరాయి. ఆ తర్వాత కష్టసాధ్యమైన ఛేదనలో యూఏఈ 50 ఓవర్లలో 199/7 స్కోరుకే పరిమితమైంది. ఉద్దిష్ సూరి (78), పృథ్వీ మధు (50) మాత్రమే ఆకట్టుకున్నారు. భారత్ నుంచి ఏకంగా తొమ్మిది మంది బౌలింగ్ చేయగా, దీపే్షకు రెండు వికెట్లు దక్కాయి.
పాక్ 297 రన్స్ తేడాతో..: మరోవైపు గ్రూప్ ‘ఎ’లోనే జరిగిన ఇంకో మ్యాచ్లో పాక్ 297 రన్స్ తేడాతో మలేసియాపై నెగ్గింది. పాక్ తొలుత 50 ఓవర్లలో 345/3 స్కోరు చేయగా, మలేసియా 19.4 ఓవర్లలో 48 పరుగులకే కుప్పకూలింది. ఈ జట్టులోని ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు.