Smriti Mandhana Gets Surprise Proposal: స్టేడియంలో స్మృతీకి పలాష్ సర్ప్రైజ్
ABN , Publish Date - Nov 22 , 2025 | 05:34 AM
దాదాపు ఆరేళ్లు ప్రేమలో మునిగితేలిన టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతీ మంధాన, బాలీవుడ్ యువ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ ఆదివారం వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు....
కప్పు నెగ్గిన చోటే పెళ్లి ప్రతిపాదన
రేపు ఒక్కటికానున్న జంట
న్యూఢిల్లీ: దాదాపు ఆరేళ్లు ప్రేమలో మునిగితేలిన టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతీ మంధాన, బాలీవుడ్ యువ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ ఆదివారం వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. అయితే, అంతకంటే ముందు పలాష్ తనకు కాబోయే శ్రీమతి స్మృతీకి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇటీవల భారత మహిళల జట్టు ప్రపంచ కప్ నెగ్గిన ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలోనే మంధానకు పెళ్లి ప్రతిపాదన చేశాడు. కళ్లకు గంతలు కట్టి స్మృతీని మైదానంలోకి తీసుకొచ్చిన పలాష్.. అనంతరం ఆమె గంతలు తీసేసి, మోకాళ్లపై కూర్చొని నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. ఈ అనూహ్య పరిణామంతో ఉద్వేగానికి లోనైన మంధాన.. సరేననడంతో ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. ఇక, స్మృతి ఇంట శుక్రవారం హల్దీ వేడుక నిర్వహించారు. సహచర క్రికెటర్లు జెమీమా, షఫాలీ వర్మ, అరుంధతీ రెడ్డి, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్ తదితరులు సంబరాల్లో పాల్గొన్నారు.
ప్రధాని మోదీ వినూత్న విషెష్
ఈ శుభ సందర్భంలో కాబోయే వధూవరులకు పలువురు సెలెబ్రిటీలు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ వినూత్న రీతిలో విషెస్ చెప్పారు. స్మృతీ మంధాన అద్భుతమైన కవర్ డ్రైవ్, పలాష్ స్వర సమ్మేళనం కలిసి మరపురాని భాగస్వామ్యాన్ని నిర్మించాలని మోదీ ట్వీట్ చేశారు.