Share News

టెస్టు లిక చాలని

ABN , Publish Date - May 08 , 2025 | 05:15 AM

సుదీర్ఘకాలంగా వస్తున్న ఊహాగానాలకు రోహిత్‌ శర్మ తెరదించాడు. టెస్టుల నుంచి రిటైరవుతున్నట్టు బుధవారం రాత్రి ప్రకటించాడు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపాడు. దాంతో క్రికెట్‌లో రెండు ఫార్మాట్లకు హిట్‌మ్యాన్‌ వీడ్కోలు...

టెస్టు లిక చాలని

సంప్రదాయ ఫార్మాట్‌కు రోహిత్‌ గుడ్‌బై

హిట్‌మ్యాన్‌ అనూహ్య నిర్ణయం

వన్డేలలో కొనసాగుతానని ప్రకటన

వరుస పరాభవాలా.. తన సారథ్యంపై విమర్శలా.. పేలవ ఫామా.. కారణం ఏదైనా హిట్‌మ్యాన్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు.

ఎలాంటి హంగూ, ఆర్భాటం లేకుండా, అందరినీ ఆశ్చర్యపరుస్తూ సంప్రదాయ ఫార్మాట్‌ నుంచి వైదొలిగాడు.

భారత క్రికెట్‌లో ఆటగాడిగా, నాయకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న రోహిత్‌ శర్మ తన బాధ్యతలను ‘పరిమితం’ చేసుకుంటూ టెస్టులకు గుడ్‌బై పలికాడు. గతేడాది ప్రపంచకప్‌ అనంతరం టీ20లకు దూరమైన రోహిత్‌.. ఇక వన్డేల్లో మాత్రం కొనసాగుతానని ప్రకటించాడు.

న్యూఢిల్లీ: సుదీర్ఘకాలంగా వస్తున్న ఊహాగానాలకు రోహిత్‌ శర్మ తెరదించాడు. టెస్టుల నుంచి రిటైరవుతున్నట్టు బుధవారం రాత్రి ప్రకటించాడు. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపాడు. దాంతో క్రికెట్‌లో రెండు ఫార్మాట్లకు హిట్‌మ్యాన్‌ వీడ్కోలు పలికినట్టయ్యింది. గత ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్‌ కప్‌ను తన సారథ్యంలో అందించిన అనంతరం రోహిత్‌ పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇక సుదీర్ఘ ఫార్మాట్‌ నుంచి తప్పుకొంటున్న విషయాన్ని రోహిత్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించాడు. ‘అందరికీ హాయ్‌..టెస్టుల నుంచి నేను రిటైర్‌ అవుతున్న విషయాన్ని మీతో పంచుకుంటున్నా. సుదీర్ఘ ఫార్మాట్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. ఇన్ని సంవత్సరాలుగా నాకు మద్దతుగా నిలిచి, నాపై ప్రేమాభిమానాలు కురిపించిన అందరికీ కృతజ్ఞతలు. వన్డేలలో మాత్రం భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తా’ అని టెస్టుల్లో తాను ధరించే టోపీతో కలిపి 38 ఏళ్ల రోహిత్‌ తన ప్రకటనను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. కాగా, ఇటీవలే రోహిత్‌ కెప్టెన్సీలో ప్రతిష్ఠాత్మక చాంపియన్స్‌ ట్రోఫీ వన్డే టోర్నీ టైటిల్‌ను టీమిండియా సొంతం చేసుకోవడం విశేషం.


6-sportssss.jpg

అందుకేనా నిర్ణయం?

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీ్‌సకు త్వరలోనే భారత జట్టును ఎంపిక చేయనున్నారు. మరోవైపు కొత్త సారథితోనే 2025-27 ప్రపంచ టెస్టు చాంపియన్‌షి్‌ప సైకిల్‌ను టీమిండియా ప్రారంభించాలని సెలెక్టర్లు నిర్ణయించినట్టు తెలిసింది. దాంతో కెప్టెన్‌గా రోహిత్‌ను తొలగించాలని సెలక్షన్‌ కమిటీ నిర్ణయించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే హిట్‌మ్యాన్‌ టెస్టులకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్టు భావిస్తున్నారు.

వారసుడు ఎవరు?

రోహిత్‌ రిటైర్‌ కావడంతో టెస్టుల్లో భారత జట్టుకు కొత్త కెప్టెన్‌ రానున్నాడు. అయితే, రోహిత్‌ వారసుడు ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరం. బుమ్రా, కేఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌, రిషభ్‌ పంత్‌ రేసులో ఉంటారు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షి్‌ప కొత్త సైకిల్‌ను జూన్‌లో ఇంగ్లండ్‌తో ఆ దేశంలో జరిగే సిరీ్‌సతో భారత్‌ ప్రారంభించనుంది. త్వరలోనే జాతీయ సెలెక్షన్‌ కమిటీ ఈ సిరీ్‌సకు సారథితోపాటు జట్టును ఎంపిక చేయనుంది.

ఒడిదుడుకులు..

2023 ప్రపంచ టెస్టు చాంపియన్‌షి్‌ప ఫైనల్లో రోహిత్‌ సారథ్యంలోనే ఆస్ట్రేలియాతో భారత్‌ తలపడింది. ఆ సైకిల్‌ టెస్టు చాంపియన్‌షి్‌పలో భారత్‌ ప్రశంసనీయంగానే రాణించింది. కానీ ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో, బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ సిరీ్‌సలో భారత జట్టు దారుణ వైఫల్యాలు చవిచూసింది. ఈ సిరీ్‌సలలో బ్యాటర్‌గా కూడా రోహిత్‌ పూర్తిగా నిరాశ పరిచాడు. పైగా..బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ సిరీస్‌ చివరి టెస్టు నుంచి రోహిత్‌ తనంతటతాను వైదొలిగాడు. దాంతో అప్పట్లోనే అతడు టెస్టుల నుంచి రిటైర్‌ అవుతాడనే ఊహాగానాలు వెల్లువెత్తాయి. వచ్చే నెలలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుండడంతో గత కొన్ని రోజులుగా రోహిత్‌ రిటైర్మెంట్‌పై తిరిగి వార్తలు షికారు చేస్తున్నాయి.

అరంగేట్రం ఘనంగా..

ఓవరాల్‌గా కెరీర్‌లో 67 టెస్టులాడిన రోహిత్‌ 2021లో విరాట్‌ కోహ్లీ నుంచి సుదీర్ఘ ఫార్మాట్‌ పగ్గాలు స్వీకరించాడు. రోహిత్‌ సారథ్యంలో 24 టెస్టులు ఆడిన భారత్‌.. 12 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. తొమ్మిదింటిలో ఓడిపోయింది. మూడు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. పరిమిత ఓవర్ల ఆటలో తిరుగులేని మొనగాడుగా పేరుపొందిన రోహిత్‌ టెస్టుల్లో మాత్రం పెద్దగా రాణించలేకపోయాడు. సుదీర్ఘ ఫార్మాట్‌ అరంగేట్రం ఘనంగా చేసినా.. తర్వాత..తర్వాత..అదే స్థాయిలో సత్తా చాటలేకపోయాడు. ఒకే ఆర్డర్‌లోగాక ఓపెనర్‌గా, వివిధ స్థాయిల్లో బ్యాటింగ్‌ చేయడం టెస్టుల్లో రోహిత్‌ అంతగా ఆకట్టుకోలేకపోవడానికి కారణంగా చెబుతారు. 2013లో స్వదేశంలో వెస్టిండీ్‌సతో జరిగిన సిరీస్‌ దిగ్గజ బ్యాటర్‌ సచిన్‌కు వీడ్కోలు. ఆ సిరీ్‌సలో ఈడెన్‌గార్డెన్స్‌ మ్యాచ్‌లో రోహిత్‌ టెస్టుల్లో అడుగుపెట్టాడు. 177 పరుగులతో భళా అనిపించాడు. సొంత గ్రౌండ్‌ ముంబైలో జరిగిన రెండో టెస్టులో మరో శతకం (111 నాటౌట్‌)తో వహ్‌వా అనిపించాడు. తర్వాత నిలకడ లోపించడంతో టెస్ట్‌ జట్టులో సుస్థిర స్థానం సంపాదించలేకపోయాడు. 2019లో దక్షిణాఫ్రికాపై టెస్టులో డబుల్‌ సెంచరీ (212) చేయడం రోహిత్‌కు అత్యుత్తమ ప్రదర్శన.


రోహిత్‌ టెస్టు కెరీర్‌

ఇన్నింగ్స్‌ 116

నాటౌట్‌ 10

రన్స్‌ 4301

అత్యధికం 212

సగటు 40.57

సెంచరీలు 12

అర్ధసెంచరీలు 18

మొత్తం మ్యాచ్‌లు 67

మ్యాచ్‌లు గెలుపు ఓటమి డ్రా

కెప్టెన్‌గా 24 12 9 3

టెస్టు అరంగేట్రం

వెస్టిండీ్‌సపై (2013 నవంబరు 6)

చివరి టెస్టు

ఆస్ట్రేలియాపై (2024 డిసెంబరు 26)

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 08 , 2025 | 05:15 AM