PV Sindhu Faces Disappointment: సింధుకు నిరాశ
ABN , Publish Date - Aug 30 , 2025 | 03:37 AM
ప్రీక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ వాంగ్ జి యీని వరుస గేముల్లో చిత్తు చేయడంతో..భారత స్టార్ పీవీ సింధు ప్రపంచ చాంపియన్షి్పలో ఆరో పతకం సాధిస్తుందని భావించారు. కానీ సింధుకు నిరాశ తప్పలేదు...
క్వార్టర్ఫైనల్లో ఓటమి ఫ కపిల జోడీ సైతం..
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షి్ప
పారిస్: ప్రీక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ వాంగ్ జి యీని వరుస గేముల్లో చిత్తు చేయడంతో..భారత స్టార్ పీవీ సింధు ప్రపంచ చాంపియన్షి్పలో ఆరో పతకం సాధిస్తుందని భావించారు. కానీ సింధుకు నిరాశ తప్పలేదు. శుక్రవారంనాటి హోరాహోరీ క్వార్టర్ఫైనల్లో భారత షట్లర్ ఓటమి పాలైంది. పుత్రి కుసుమ వర్దని (ఇండోనేసియా)తో జరిగిన రౌండ్-8 పోరులో సింధు 14-21, 21-13, 16-21తో పరాజయం చవిచూసింది. అంతకుముందు జరిగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ఫైనల్లో కపిల/క్రాస్టో ద్వయం 15-21, 13-21తో వరుస గేముల్లో వరల్డ్ నెం.4 మలేసియా జోడీ చెన్ టాంగ్/తో ఈ వీ చేతిలో ఓడిపోయింది. 23 ఏళ్ల వర్దనితో మ్యాచ్లో కీలకమైన తరుణాల్లో సింధు తడబాటుకు లోనైంది. తొలి గేమ్లో విరామానికి 11-7తో నిలిచిన కుసుమ 18-9 తిరుగులేని ఆధిక్యంలో నిలిచి, అదే జోరులో గేమును చేజిక్కించుకుంది. కానీ రెండో గేములో నెట్ ఆటతోపాటు తనదైన శైలి స్మాష్లతో పీవీ ముందంజ వేసింది. ఆపై 16-6తో ఆధిక్యం ప్రదర్శించిన సింధు 21-13తో గేమును సొంతం చేసుకుని పోటీలోకి వచ్చింది. ఇక నిర్ణాయక మూడో గేములో ఇద్దరూ తగ్గేదెలే అనేలా ఆడడంతో 7-7, 8-8, 9-9తో స్కోరు సమమై ఉత్కంఠ పెరిగిపోయింది. ఈ తరుణంలో సింధు తప్పిదాలను సద్వినియోగం చేసుకున్న వర్దని 15-11తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే సింధు పోరాడి 16-17కి ఆధిక్యాన్ని తగ్గించింది. కానీ పొరపాట్లను పునరావృతం చేసిన భారత షట్లర్ గేమును, మ్యాచ్ను కోల్పోయింది.